Amchur Crop Demand in Nizamabad: ఉమ్మడి రాష్ట్రంలో ఆమ్ చూర్ విక్రయాలకు ఏకైక కేంద్రం నిజామాబాద్ మార్కెట్ యార్డు. మార్కెట్లో ఆమ్ చూర్ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గత కొద్ది రోజులుగా మార్కెట్కు దీన్ని రైతులు తీసుకొస్తున్నారు. ఏటా ఈ సీజన్లో వివిధ జిల్లాల నుంచి రైతులు, గుత్తేదారులు నిజామాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొస్తుంటారు. ఆమ్చూర్ చేసే సమయంలో అంటే మామిడి కోసి తంకర్లుగా మార్చే సమయంలో వర్షం పడితే దాని రంగు మారిపోతుంది. ఈ రకానికి మార్కెట్లో తక్కువ ధర లభిస్తుంది. రంగు మారకుండా ఉన్న దానికి మాత్రం సగటు ధర రూ.18 వేల పైనే పలుకుతోంది. ఈ సీజన్లో క్వింటా ఆమ్ చూర్ గరిష్ఠ ధర రూ.37,500 పలికింది. మంచి ధరలు వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Amchur Colour Change Reasons : గతేడాది ఇంతే అత్యధిక ధర పలికింది. మామిడి సీజన్ ప్రారంభంలో దిగుబడిపై రైతులు నమ్మకంతో ఉండగా ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులకు మామిడి నేల రాలిపోయింది. దీంతో కాయలు కోసి ఆరబెట్టి ఆమ్ చూర్ను మార్కెట్కు తరలిస్తున్నారు. తద్వారా దీనికి రంగు మారే వాటిని కొనుగోలుదారులు తక్కువకు కొంటున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఈ పంటకు నిజామాబాద్ మార్కెట్ అతిపెద్ద మార్కెట్. ఉత్తరాది రాష్ట్రాలకు, విదేశాలకు ఇది ఎగుమతి అవుతుంది. నిజామాబాద్ మార్కెట్లో దీనికి మంచి ధరలు లభిస్తుండటంతో ఇతర ప్రాంతాల రైతులు ఇక్కడికి తీసుకువస్తున్నారు.
"అకాల వర్షాల కారణంగా మామిడి కాయలు అన్నీ రాలిపోయాయి. దీంతో ఆమ్ చూర్ కాస్త రంగు మారింది. మా పంటకు ఇంకా ధర నిర్ణయించలేదు. రెండు మూడు రోజుల క్రితం క్వింటా రూ.20 వేల పైగా పలికింది. అలానే పెడితే పర్వాలేదు. అంతకంటే తక్కువ ధర పెడితే నష్టపోతాం. మేము సుమారు రూ.లక్షన్నర పెట్టుబడి పెట్టాం." - లక్ష్మి, సిద్దిపేట జిల్లా