ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో వర్షాలు - సముద్రతీరంలో కోతకు గురైన ఇళ్లు

వాయుగుండం తీరం దాటాక పలు ప్రాంతాల్లో వర్షాలు - శుక్రవారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

Rains in Andhra Pradesh
Rains in Andhra Pradesh (ETV Bharat)

Rains in Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీరం దాటింది. తుపాను తీరం దాటాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వానలు కురిశాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ తీరంలో ఇళ్లు కోతకు గురయ్యాయి. సీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి పలు జాగ్రత్తలు సూచించారు.

గురువారం ఉదయం చెన్నై-నెల్లూరు మధ్య తడ సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది. తర్వాత క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారింది. అనంతరం మరింత బలహీనపడుతుందని తెలిపింది. ఈ ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ ముఖ్య అధికారి కేవీఎస్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. పోర్టుల్లో ప్రకటించిన ప్రమాద హెచ్చరికల్ని ఉపసంహరించినట్లు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొచ్చని చెప్పారు.

భారీ వర్షాలపై కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు పరిస్థితిని వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడినట్లు అధికారులు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అల్పపీడన ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. బుధవారం రాత్రి నుంచి భారీగా రాకాసి అలలు ఎగసిపడ్డాయి.

విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఉప్పాడ, సూరాడపేట, మాయాపట్నం, జగ్గరాజుపేట, కోనపాపపేట గ్రామాల్లో పదుల సంఖ్యలో గృహాలు కోతకు గురయ్యాయి. పలు ఇళ్లు ఓ వైపునకు ఒరిగిపోయి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. బాధితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అద్దె ఇళ్లలోకి, ప్రమాదకరంగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి తరలివెళ్లారు. కోతకు గురైన ప్రాంతాల్లో కాకినాడ ఆర్డీవో మళ్లిబాబు పర్యటించారు. ఇళ్లు కోల్పోయిన బాధితుల వివరాలు నమోదు చేసుకున్నారు. తెలుగుదేశం పిఠాపురం నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ వర్మ బాధితుల్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అర కిలోమీటరు మేర సముద్రం నీరు చొచ్చుకొచ్చింది. అంతర్వేదిలో సముద్రం నీరు పోటెత్తింది. పల్లిపాలెంలో ఇళ్లల్లోకి నీరు చేరింది. మలికిపురం మండలం కేశవదాసుపాలెం, చింతలమమోరి, శంకరగుప్తం, పడమటిపాలెం, కేసనపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెం గ్రామాల్లో నీరు చేరింది. తీరంలోని ఆక్వా చెరువులు మొత్తం పూర్తిగా నీట మునిగాయి. ఓఎన్జీసీ టెర్మినల్‌ను సముద్రం నీరు ముంచేసింది. టెర్మినెల్ గోడ వెనకవైపు తీవ్ర కోతకు గురైంది.

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో సజ్జ రైతులు నిండా మునిగారు. కనిగిరి, వెలిగండ్ల, చంద్రశేఖరపురం మండలాల్లో సుమారు 1700 ఎకరాల్లో సాగు దెబ్బతింది. సజ్జ కంకులు తడిసి మొలకలు వచ్చాయి. వైఎస్​ఆర్​ జిల్లా పెద్దముడియంలో కుందూనది ఉద్ధృతంగా ప్రవహించడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముద్దనూరు మండలంలో పంటలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఉల్లి పంట దెబ్బతింది. చిన్నకత్తెర పల్లెలో మట్టిమిద్దె కూలింది.ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వర్షం నీరు పెన్నా నదిలోకి రావడంతో సిద్ధవటం వద్ద పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో వరినారు మళ్లు నాలుగు రోజులుగా నీళ్లలోనే నానుతున్నాయి.

వాయుగుండ తీరం దాటడంతో నెల్లూరు జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కొన్నిచోట్ల పొలాలు నీటిలోనే నానుతున్నాయి. అయితే ఈ వర్షంతో సోమశిల జలాశయంలోకి నీరు చేరింది. కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. రెండో పంటకు సాగు నీటి సమస్య రాదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆత్మకూరు, నెల్లూరు గ్రామీణం,కోవూరు నియోజకవర్గాల్లోని జగనన్న కాలనీల్లోకి నీరు చేరింది.

ఉమ్మడి అనంతపురంలో ఎడతెరిపి లేని వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో మిరప,కంది,జొన్న, వరి మడుల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం పడింది.దీంతో చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాయలవారిపల్లి, కోవెల గుట్టపల్లి చెక్‌డ్యాంలతోపాటు చిత్రావతి చెక్ డ్యాం నిండుకుండలా మారింది. చిత్రావతి ప్రవాహంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తచెరువు మండలం కనిశెట్టిపల్లిలో మిద్దె కూలిపోయింది.

విశాఖ జిల్లా కొంగపాలెంలో వర్షాలకు కొండవాలు ప్రాంతంలో ఇల్లు కూలింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జోరు వానలు పడ్డాయి.

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details