Vinesh Phogat Returned India : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తాజాగా స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు అభిమానులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అయితే వారందరినీ చూసిన వినేశ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. అక్కడే కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా, రెజర్లు సాక్షిమలిక్, బజరంగ్ పునియా తదితరులు తనకు దగ్గరకు తీసుకుని ఓదార్చారు. మరోవైపు ఆమెకు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు వచ్చిన ప్రముఖులు వినేశ్కు సపోర్ట్ తెలిపారు.
'ఆ రోజు వినేశ్ ఫొగాట్ చనిపోతుందని అనుకున్నా!'
పారిస్ ఒలింపిక్స్లో అనర్హతకు గురైన వినేశ్ ఫొగాట్ ఫైనల్ ముందు రోజు రాత్రి బరువు తగ్గించేందుకు చేసిన ప్రయత్నాల గురించి ఆమె కోచ్ వోలర్ అకోస్ చెప్పారు. బరువు తగ్గించే ప్రక్రియలో ఆమె తీవ్రంగా శ్రమించిందని చెప్పిన అకోస్, ఓ దశలో ఆమె ప్రాణాల గురించి భయపడ్డామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వినేశ్ బరువు తగ్గించే ప్రక్రియలో ఆ రోజు టీమ్లోని ప్రతి సభ్యుడు ప్రయత్నించారని చెప్పుకొచ్చారు.
'వినేశ్ సెమీఫైనల్ తర్వాత 2.7 కిలోల బరువు ఎక్కువగా ఉంది. దీంతో మేం బరువు తగ్గే ప్రక్రియ ప్రారంభించాం. తొలుత 1 గంట 20 నిమిషాలు వ్యాయామం చేయించాం. అప్పుడు 1.2కేజీలు తగ్గింది. అప్పటికీ ఇంకా 1.5కేజీలు అదనంగా ఉంది. ఇక 50 నిమిషాల ఆవిరి స్నానం తర్వాత ఆమె శరీరంపై చెమట చుక్క కూడా కనిపించలేదు. అర్ధరాత్రి నుంచి ఉదయం 5:30 దాకా ఆమె వేర్వేరు సాధనలు చేసింది. దీంతో ఓపిక క్షీణించి ఆమె కింద పడిపోయింది. అయినప్పటికీ మళ్లీ ఆమెను పైకి లేపి సాధన చేయించాం. కానీ, ఆ సమయంలో తన ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందేమో అనిపించింది' అని అకోస్ తన హంగేరీ భాషలో ట్వీట్లో రాసుకొచ్చాడు. అయితే తర్వాత అకోస్ ఆ ట్వీట్ను డిలీట్ చేశారు.