Karnataka High Court Rejects Lakshya Sens Plea : ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ కు షాక్!.వయసు విషయంలో తప్పుడు సమాచారాన్ని అందించి ఎందరో క్రీడాకారులకు రావాల్సిన అవకాశాలను కాజేశారంటూ లక్ష్య సేన్, అతని కుటుంబ సభ్యులు, కోచ్ విమల్ కుమార్పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
కోర్టును ఆశ్రయించిన లక్ష్యసేన్
బెంగళూరులోని ఎనిమిదో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ లక్ష్యసేన్, కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 19న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ ఎంజీ ఉమా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఈ ఎఫ్ఐఆర్లను కొట్టేయలేమని తీర్పునిచ్చారు.
'లక్ష్యసేన్ను వేధించడానికి కేసులు'
లక్ష్యసేన్ను వేధించడానికే ఫిర్యాదుదారులు ఉద్దేశపూర్వకంగా ఈ కేసులు పెట్టారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు ఎదుట వాదించారు. లక్ష్యసేన్పై ఫిర్యాదు నిరాధారమైనదని ఆరోపించారు. అయితే, కంప్లైంట్ చేసిన వ్యక్తి డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించారని, ఈ దశలో కేసును కొట్టివేయడం సరికాదంటూ హైకోర్టు వెల్లడించింది. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు లక్ష్యసేన్ తరఫు న్యాయవాదులు.
ఇదీ జరిగింది :
బ్యాడ్మింటన్ టోర్నమెంట్లకు అర్హత సాధించడానికి, ప్రభుత్వ ప్రయోజనాలను పొందడానికి లక్ష్య సేన్ తన వయసును రెండున్నర ఏళ్లు తగ్గించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక బ్యాడ్మింటన్ అసోసియేషన్కు తప్పుడు సమాచారంతో ఫేక్ ఏజ్ సర్టిఫికెట్ను సమర్పించాడని అని గోవియప్ప నాగరాజా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా లక్ష్యసేన్ వయసుకు సంబంధించిన అధికారిక పత్రాలను పొందారు. దీని ఆధారంగా ఏసీఎంఎం కోర్టు హైగ్రౌండ్స్ పోలీసులను లక్ష్యసేన్, ఇతరులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని లక్ష్యసేన్ కోర్టును ఆశ్రయించగా ఆయనకు కోర్టులో చుక్కెదురైంది.