Champions Trophy Finals: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ రసవత్తరంగా జరుగుతోంది. టైటిల్ కోసం 8 దేశాలు పోటీ పడుతున్నాయి. చివరిసారిగా 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. అయితే ఈసారి విజేత ఎవరనే అంచనాలు పక్కన పెడితే, ఒకటి లేదా అంత కంటే ఎక్కువ సార్లు ఫైనల్ చేరిన దాదాపు అన్ని జట్లు ఒకసారైనా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ నెగ్గాయి. కానీ, ఒక జట్టు మాత్రం రెండుసార్లు ఫైనల్స్కి చేరినా కప్పు గెలవలేకపోయింది. రెండుసార్లు కూడా రన్నరప్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంతకీ అది ఏ జట్టంటే?
భారత్ నాలుగుసార్లు
నాలుగు జట్లు ఒకటి కంటే ఎక్కువసార్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడాయి. భారత్ అత్యధికంగా 4సార్లు ఫైనల్స్ ఆడింది. 2002లో ఫలితం తేలకపోవడం వల్ల శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. 2013లో ఎంఎస్ ధోని నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక 2000లో న్యూజిలాండ్, 2017లో పాకిస్థాన్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది.
మరోవైపు ఆస్ట్రేలియా రెండుసార్లు ఫైనల్స్కు అర్హత సాధించింది. 2006లో వెస్టిండీస్, 2009లో దక్షిణాఫ్రికాని ఓడించి విజేతగా నిలిచింది. సొంతంగా రెండు ట్రోఫీలు గెలిచిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది.
అన్ లక్కీ టీమ్!
అయితే రెండుసార్లు ఫైనల్స్ వరకూ చేరినా, కప్పును ముద్దాడలేకపోయిన జట్టు ఏదో కాదు ఇంగ్లాండ్. వన్డేల్లో అత్యుత్తమ జట్లలో ఒకటైన ఇంగ్లాండ్, రెండు ఫైనల్స్ చేరినా ఛాంపియన్గా నిలువలేకపోయింది. 2004లో మైఖేల్ వాన్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరుకుంది. ఈ ఫైనల్లో వెస్టిండీస్తో తలపడింది. ఓ దశలో ఇంగ్లాండ్ గెలిచేలా కనిపించినా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చివరికి వెస్టిండీస్ విజేతగా నిలిచింది. రెండు వికెట్ల తేడాతో గెలిచిన విండీస్ కప్పు ఎగరేసుకుపోయింది.
ఇక తొమ్మిదేళ్ల తర్వాత 2013లో ఇంగ్లాండ్ మరోసారి ఫైనల్కు అర్హత సాధించింది. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో అలిస్టర్ కుక్ జట్టుకు నాయకత్వం వహించాడు. టైటిల్ పోరులో భారత్తో తలపడింది. బర్మింగ్హామ్లో జరిగిన ఈ ఫైనల్కి వర్షం అంతరాయం కలిగించింది. దీంతో 20ఓవర్ల ఫార్మాట్లో మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్లో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఇంగ్లాండ్ మరోసారి రన్నరప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 'గోల్డెన్ బ్యాట్' - వరుస ఎడిషన్లలో సాధించిన ఏకైక భారత క్రికెటర్ అతడే!
6000 పరుగులు, 600 వికెట్లు - క్రికెట్ హిస్టరీలో గ్రేటెస్ట్ ఆల్రౌండర్లు వీళ్లే!