Rohit Sharma On 46 All Out :న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ దారుణంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 46 పరుగులకే కుప్పకూలింది. దీంతో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా ముందుకొచ్చాడు. సాధారణంగా కెప్టెన్లు టెస్టుల్లో మ్యాచ్ ప్రారంభం లేదా పూర్తయ్యాక మీడియాతో మాట్లాడుతారు. కానీ, స్వదేశంలో అత్యల్ప స్కోరుకు ఆలౌటైన తర్వాత ఘోరమైన ప్రదర్శనను వివరించే బాధ్యత తీసుకున్నాడు. మీడియా నుంచి ఎదురైన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
'ఈరోజు మాది కాదు. ఇంతకుముందు కూడా ఇలాంటి మ్యాచ్లు ఆడాము. కెప్టెన్గా స్కోర్ బోర్డుపై 46 పరుగులు చూసి బాధపడ్డాను. మొదట బ్యాటింగ్ ఎంచుకోవడమే నా తప్పు. నేను ఫ్లాట్ పిచ్ని ఆశించాను. కానీ, పిచ్ని నేను సరిగ్గా అంచనా వేయలేకపోయాను. ఇది ఒక సవాలు. అప్పుడప్పుడు ఇలాంటి సవాళ్లు స్వీకరించడం అవసరం. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ పొజిషన్లు మార్చాలనుకోలేదు. అందుకే విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే బాధ్యత తీసుకున్నాడు. ఒక సీనియర్ ఆటగాడు అలా చేయడం చాలా గ్రేట్' అని అన్నాడు.
పంత్కి గాయం
రిషబ్ పంత్ కీపింగ్ చేస్తుండగా ఎడమ మోకాలికి బంతి తగిలింది. 2022లో కారు ప్రమాదం తర్వాత అదే మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. బంతి తగిలిన చోట వాపు రావడం వల్ల పంత్ మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడాడు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేశాడు. దీనిపై రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. 'గాయం పెద్దది కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా పంత్ను కొనసాగించలేదు. పంత్ రాత్రికి కోలుకుంటాడు. మూడో రోజు మ్యాచ్ ఆడుతాడని భావిస్తున్నాం' అని చెప్పాడు.