తెలంగాణ

telangana

అనారోగ్య సమస్యలు పోగొట్టే శని ప్రదోష పూజ- ఎలా? ఎప్పుడు చేయాలి? - Shani Pradosh Puja

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 3:40 PM IST

Shani Pradosh Puja Vidhi : అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు మనిషి జీవితాన్ని నరకం చేస్తాయి. ఎంత ప్రయత్నం చేసిన రుణబాధలు తీరకపోవడం, అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటే ఒక్కసారి శని ప్రదోష పూజ చేస్తే ఎలాంటి బాధలైనా పోతాయని అంటారు. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, నరాల సంబంధిత రుగ్మతలు వంటి సమస్యల నుంచి విముక్తి కావాలంటే శని ప్రదోష పూజ చేయాల్సిందే! శని ప్రదోష పూజ పూర్తి వివరాల కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.

Shani Pradosh Puja
Shani Pradosh Puja (Getty Images)

Shani Pradosh Puja :శివ మహా పురాణంలో వివరించిన ప్రకారం దేవదానవులు క్షీరసాగర మధనం చేసినప్పుడు వచ్చిన విషాన్ని పరమశివుడు తన కంఠంలో ఉంచుకొని సమస్త లోకాలను రక్షించిన రోజును శనిప్రదోషంగా పిలుస్తారు.

శని ప్రదోషం ఎప్పుడు వస్తుంది
ప్రతి నెలలో మనకు త్రయోదశి తిథి రెండు సార్లు వస్తుంది. ఒకటి శుక్ల పక్షంలో, రెండవది కృష్ణ పక్షంలో. అయితే శనివారం త్రయోదశి తిథి మధ్యాహ్నం సమయంలో ఉంటే దాన్ని శని ప్రదోషం అంటారు. ఆగస్టు 17 వ తేదీ శనివారం మధ్యాహ్నం సమయంలో త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఆ రోజు శని ప్రదోష పూజను చేసుకోవాలి.
శని ప్రదోష పూజకు శుభసమయం
శని ప్రదోషం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపు చేసుకోవచ్చు.


శని ప్రదోష పూజ ఎవరు చేయాలి?
జాతకంలో శని దశలు అనగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వారు ఈ పూజను తప్పకుండా చేయాలి. అలాగే ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు ఉన్నవారు కూడా ఈ పూజతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, బి.పి, షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాలు, నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే వారు శని ప్రదోషం రోజున శివారాధన చేయడం ద్వారా ఆ దోషాలను తొలగించుకోవచ్చు.

సకల దోష పరిహారం శివారాధన
శనివారం వచ్చే ప్రదోషం రోజున సూర్యోదయం నుంచి రోజంతా ఉపవాసం చేసి, సాయంత్రం వేళ శివార్చన చేయడం ద్వారా సమస్త జాతక దోషాలు పోయి అనుకున్న కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. అంతేకాదు ఈ ప్రదోష కాల పూజను భక్తి శ్రద్ధలతో ఒక్క శివుడిని పూజిస్తే సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం.

శని ప్రదోష పూజ ఎలా చేయాలి?
శనివారం మధ్యాహ్నం త్రయోదశి తిథి ఉన్న రోజున సాయంత్రం 4.30 నుంచి 6 వరకు గల సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఈ సమయంలో ఆవుపాలతో శివునికి అభిషేకం చేయించి, బిల్వ పత్రాలు, శంఖుపూలు సమర్పించుకుని శివాష్టకం పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. సమస్త జాతక దోషాలు పోతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.

అభిషేకం చేయించలేని వారు ఏమి చేయాలి?
శని ప్రదోషం సమయంలో శివాభిషేకం చేయడానికి వీలు కాని వారు కనీసం తమ ఇంట్లో ప్రదోష వేళలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆ శివయ్య కరుణించి కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు. సమస్త దోషాలను పోగొట్టి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు.

సకల పాపహరణం - శని ప్రదోష పూజ!
శని ప్రదోష పూజ చేసిన వారికి గత జన్మలో చేసిన పాపాలు పోవడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి. మనమందరం కూడా రానున్న శని ప్రదోష పూజను ఆచరించి ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుదాం.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

జూన్29 నుంచి శని తిరోగమనం- ఆ 3రాశుల వారికి బ్రహ్మాండ యోగం- మీది ఉందేమో చెక్! - Shani Retrograde From The 29th June

జాతకంలో దోషాలా? శనివారం ఆ చెట్టుకు పూజ చేస్తే అంతా సెట్! - Puja For Shani Shanti

ABOUT THE AUTHOR

...view details