Shani Pradosh Puja :శివ మహా పురాణంలో వివరించిన ప్రకారం దేవదానవులు క్షీరసాగర మధనం చేసినప్పుడు వచ్చిన విషాన్ని పరమశివుడు తన కంఠంలో ఉంచుకొని సమస్త లోకాలను రక్షించిన రోజును శనిప్రదోషంగా పిలుస్తారు.
శని ప్రదోషం ఎప్పుడు వస్తుంది
ప్రతి నెలలో మనకు త్రయోదశి తిథి రెండు సార్లు వస్తుంది. ఒకటి శుక్ల పక్షంలో, రెండవది కృష్ణ పక్షంలో. అయితే శనివారం త్రయోదశి తిథి మధ్యాహ్నం సమయంలో ఉంటే దాన్ని శని ప్రదోషం అంటారు. ఆగస్టు 17 వ తేదీ శనివారం మధ్యాహ్నం సమయంలో త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఆ రోజు శని ప్రదోష పూజను చేసుకోవాలి.
శని ప్రదోష పూజకు శుభసమయం
శని ప్రదోషం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపు చేసుకోవచ్చు.
శని ప్రదోష పూజ ఎవరు చేయాలి?
జాతకంలో శని దశలు అనగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వారు ఈ పూజను తప్పకుండా చేయాలి. అలాగే ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు ఉన్నవారు కూడా ఈ పూజతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, బి.పి, షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాలు, నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే వారు శని ప్రదోషం రోజున శివారాధన చేయడం ద్వారా ఆ దోషాలను తొలగించుకోవచ్చు.
సకల దోష పరిహారం శివారాధన
శనివారం వచ్చే ప్రదోషం రోజున సూర్యోదయం నుంచి రోజంతా ఉపవాసం చేసి, సాయంత్రం వేళ శివార్చన చేయడం ద్వారా సమస్త జాతక దోషాలు పోయి అనుకున్న కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. అంతేకాదు ఈ ప్రదోష కాల పూజను భక్తి శ్రద్ధలతో ఒక్క శివుడిని పూజిస్తే సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం.
శని ప్రదోష పూజ ఎలా చేయాలి?
శనివారం మధ్యాహ్నం త్రయోదశి తిథి ఉన్న రోజున సాయంత్రం 4.30 నుంచి 6 వరకు గల సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఈ సమయంలో ఆవుపాలతో శివునికి అభిషేకం చేయించి, బిల్వ పత్రాలు, శంఖుపూలు సమర్పించుకుని శివాష్టకం పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. సమస్త జాతక దోషాలు పోతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.