తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

రుద్రారం గణేశ్‌ మహిమ- 11 ప్రదక్షిణలు చేస్తే చాలు- కోర్కెలు తీరడం ఖాయం!

మనస్సులోని కోర్కెలు తీర్చే రుద్రారం గణేశుడు- అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

Ganesh
Ganesh (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Updated : 12 minutes ago

Rudraram Ganesh Gadda Temple : వీసాల దేవుడుగా పేరొందిన చిలుకూరు బాలాజీ ఆలయం లాంటిదే ఈ ఆలయం కూడా! మనస్సులోని కోరిక స్వామికి విన్నవించి 11 ప్రదక్షిణలు చేస్తే చాలు. మీ మనస్సులోని కోరిక నెరవేరుతుంది!!. కానీ ఆ కోరిక తీరిన తర్వాత తప్పకుండా 108 ప్రదక్షిణాలు చేసి మొక్కు తీర్చుకోవాలి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశిష్టత ఏమిటి? తదితర ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

రుద్రారం గణేశ్‌ గడ్డ దేవాలయం
తెలంగాణ రాష్ట్రంలోని ప‌టాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలో వెలసిన ఈ గణేశ్‌ ఆలయం అత్యంత మహిమాన్వితమైనది. దక్షిణాభిముఖంగా ఉన్న ఈ ఆలయంలో వినాయకుడు స్వయంభువుగా వెలిశాడు. క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దు ప్రాంతంలోని ప్రాచీన పుణ్య‌క్షేత్రాల‌లో ఒకటైన ఈ ఆల‌యంలో గ‌ణ‌నాథుడు సంక‌ట‌హ‌ర చ‌తుర్థి రోజున విశేషంగా పూజ‌లు అందుకుంటారు.

ఆలయ స్థల పురాణం
దాదాపు 200 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. క‌ర్ణాట‌క‌కు చెందిన శివ‌రామ భ‌ట్టు అనే వ్యక్తి గ‌ణేశుడికి ప‌ర‌మ భ‌క్తుడు. శివ‌రామ భ‌ట్టు ఎక్క‌డుంటే అక్కడికి గ‌ణ‌నాథుడు స్వ‌యంగా వ‌చ్చి పూజ‌లు అందుకుంటాడ‌ట‌. ఒకసారి ఇతను కాలిన‌డ‌క‌న తిరుమ‌ల వెళ్లాల‌ని నిర్ణయించుకున్నాడు. తిరుమ‌ల వెళ్తూ మార్గమధ్యంలో రుద్రారం అడ‌వుల్లో ఆగాడు. ఆ రోజు సంకష్టహర చతుర్థి కావడం వల్ల శివ‌రామ భ‌ట్టు అక్క‌డ సింధూరంతో స్వామి విగ్ర‌హాన్ని త‌యారుచేసి పూజించాడు. అనంతరం ఆ విగ్ర‌హాన్ని అడ‌విలోనే వ‌దిలేసి శివ‌రామ భ‌ట్టు తిరుమ‌లకు నడుచుకుంటూ వెళ్ళాడు.

కనుమరుగైన గణేశుని విగ్రహం
కొన్నాళ్లకు శివ‌రామ భ‌ట్టు పూజించిన సింధూర విగ్ర‌హం క‌నుమ‌రుగైపోయింది. కాలక్రమంలో ఓసారి మఖందాస్ అనే భ‌క్తుడు అడ‌విలో గుర్రంపై సంచ‌రిస్తుండ‌గా, శివ‌రామ భ‌ట్టు పూజించిన గ‌ణ‌నాథుడి విగ్రహం ఉన్న ప్రాంతానికి వచ్చేసరికి ఆ గుర్రం క‌ద‌ల్లేక‌పోయింది. దాంతో ఆ విగ్ర‌హం ప‌క్క‌నే మ‌ఖందాస్ నిద్ర‌పోయాడు. అప్పుడు అత‌నికి క‌ల‌లో వినాయ‌కుడు క‌నిపించి త‌న‌కు అక్క‌డే చిన్న గుడి క‌ట్టాల‌ని కోరాడు. దాంతో మ‌ఖందాస్ వెంట‌నే గుడి క‌ట్టించే పని మొద‌లుపెట్టాడు. అలా ఈ ఆల‌యం ఎంతో ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది.

ఆలయ విశేషాలు
గ‌ర్భాలయంలో స్వామి విగ్ర‌హం సింధూరంతో ఉంటుంది. స్వామివారి విగ్ర‌హం కింద మ‌క‌ర తోర‌ణంతో పాటు సూక్ష్మ గ‌ణ‌ప‌తి విగ్ర‌హం కూడా చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది.

కోర్కెలు తీర్చే సింధూర ఏక‌దంతుడు!
ఈ ఆలయంలో స్వామివారు ద‌క్షిణ ముఖంగా ఉన్నందున కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయని విశ్వాసం. స్వామికి మన మనస్సులోని కోరికను చెప్పుకొని 11 ప్రదక్షిణలు చేస్తే 41 రోజుల్లోనే కోరిక‌లు నెర‌వేరుతాయ‌ని భ‌క్తుల నమ్మకం. కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి స్వామి వారికి మొక్కు చెల్లించుకోవాలి. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని తలపించే ఈ సంప్రదాయం అనాదిగా ఎంతో మంది భక్తుల మనోభీష్టాలను నెరవేర్చిందని స్థానికులు చెబుతుంటారు.

ఉత్సవాలు వేడుకలు
రుద్రారం గణేశ్‌ గడ్డ ఆలయంలో ప్రతిరోజూ స్వామివారికి నిత్య పూజాదికాలు త్రికాలంలో ఘనంగా జరుగుతాయి. ప్రతినెలా సంకష్టహర చతుర్థి రోజు స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. అలాగే వినాయక చవితి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక ఏడాదికి ఒకసారి పుష్య‌శుద్ధ పాడ్య‌మి నుంచి పుష్య‌శుద్ధ చ‌తుర్ధ‌శి వ‌ర‌కు జరిగే స్వామివారి జ‌న్మ‌దినోత్స‌వ వేడుక‌లు అంబ‌రాన్ని అంటుతాయి.

ఆలయానికి ఇలా చేరుకోవచ్చు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి సులభంగా చేరుకోవడానికి సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని మనమందరం కూడా దర్శిద్దాం. మన మనోభీష్టాలను నెరవేర్చుకుందాం.

ఓం శ్రీ గణేశాయ నమః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

Last Updated : 12 minutes ago

ABOUT THE AUTHOR

...view details