తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

రుణ విముక్తి కోసం లక్ష్మీదేవి పూజ - శుక్రవారం ఈ పరిహారాలు పాటిస్తే సిరిసంపదలు మీ సొంతం!

సిరిసంపదలు కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ - రుణ బాధల నుంచి విముక్తి!

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Friday Lakshmi Puja
Friday Lakshmi Puja (Getty Images)

Friday Lakshmi Puja :ఏ వ్యక్తికైనా జీవితంలో ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. పుష్కలంగా ధనం ఉంటే ఎలాంటి సమస్యలు లేకుండా జీవించవచ్చు. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు కూడా పెరుగుతాయి. ఎంత సంపాదించినా ఖర్చయిపోవడం, ఆర్థిక వృద్ధి లేకపోగా రుణబాధలు పీడించడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఒక్కసారి ఈ పరిహారాలు పాటించి చూడండి. తప్పకుండా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

సిరిసంపదలు వృద్ధికి లక్ష్మీ పూజ
వ్యాస మహర్షి రచించిన పద్మపురాణంలో వివరించిన ప్రకారం ధనధాన్యాలు, సిరిసంపదలు పుష్కలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడంతో పాటుగా కొన్ని పరిహారాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఆ పరిహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్థిక వృద్ధికి రుణవిముక్తి సులభమైన పరిహారాలు

  • వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందాలంటే ఇంటి అలంకరణ, దేవుని మందిరంలో వెండితో చేసిన ఏనుగు బొమ్మలు పెడితే ఆర్థికంగా శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.
  • వెండి ఏనుగులను ఇంట్లో ఈశాన్య దిక్కులో ఉంచితే సకల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో దేవుడి గదిలో పెడితే ఆర్థిక కష్టాలు, సమస్యలు అన్నీ పోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.
  • మంగళ శుక్రవారాల్లో ఎవరికీ డబ్బును ఇవ్వకూడదు. ఇలా ఇవ్వడం వలన ఆర్థికంగా అనేక కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
  • శుక్రవారం లక్ష్మీదేవికి తేనే కలిపిన పచ్చిపాలు నైవేద్యంగా సమర్పిస్తే సిరి సంపదలకు లోటుండదని అంటారు.
  • ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు శుక్రవారం కనకధారా స్తోత్రం చదువుకుని లక్ష్మీదేవికి ఇష్టమైన పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా 5 శుక్రవారాలు చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
  • శుక్రవారం మహిళలు స్నానం చేసే నీటిలో, అలాగే ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేసినట్లయితే దృష్టి దోషాలు తొలగిపోయి రుణ విముక్తి కలుగుతుంది.
  • వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలును సంపదకు చిహ్నంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఇంటి ముఖద్వారానికి ఎదురుగా ఒక పళ్లెంలో నీటిని పోసి అందులో తాబేలు బొమ్మను ఉంచితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారని వాస్తు శాస్త్రం చెబుతోంది.
  • క్షీర సాగర మథనంలో ఉద్భవించిన అద్భుత వస్తువుల్లో శంఖం ఒకటి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన శంఖాన్ని పూజలో ఉంచి ప్రతినిత్యం పూజ పూర్తయ్యాక ఇంటి యజమాని శంఖారావం చేస్తే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. ఊహించని అదృష్టాలు కలుగుతాయి.

పైన సూచించిన పరిహారాలన్నీ ఎక్కువ డబ్బు ఖర్చు లేకుండా సులభంగా చేసుకోగలిగేవే. ఆర్థిక వృద్ధి పొందటానికి, రుణ విముక్తులు కావడానికి ఈ పరిహారాలు పాటిద్దాం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు పొందుదాం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details