తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

మనోభీష్టాలు తీర్చే శివపార్వతుల ఆరాధన- 'బుధ ప్రదోష' వ్రతం చేస్తే అన్నీ జయాలే! - Budh Pradosh Vrat 2024

Budh Pradosh Vrat 2024 : శివపార్వతుల ఆరాధనకు విశిష్టమైన ప్రదోషం ఒక ఏడాదిలో 24 వస్తాయి. బుధవారం రోజు జరుపుకోనున్న బుధ ప్రదోష వ్రతం ఎలా ఆచరించాలి? ఆ వ్రతఫలం ఎలా ఉంటుంది అనే ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

Budh Pradosh Vrat 2024
Budh Pradosh Vrat 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 10:33 PM IST

Budh Pradosh Vrat 2024 :హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ప్రదోషం పరమ పవిత్రమైనది. ప్రదోష వ్రతం నెలకు రెండుసార్లు వస్తుంది. శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి తిథి నాడు ప్రదోషం వస్తుంది. ఏ రోజైతే సూర్యాస్తమయం తరువాత కనీసం 2.30 గంటల సమయం పాటు త్రయోదశి తిథి ఉంటుందో ఆరోజు సాయంత్రం సమయాన్ని ప్రదోష సమయంగా చెబుతారు.

బుధ ప్రదోషం
ప్రదోషం వచ్చే వారాన్ని బట్టి ప్రదోషం పేరు మారుతుంది. ఈసారి బుధవారం ప్రదోషం రావడం వలన దీనిని బుధ ప్రదోషం అంటారు.

ప్రదోషంలో ఏ దేవుని పూజించాలి
శివపార్వతులకు అంకితమైన ప్రదోషం రోజు శివపార్వతులను పూజించడం వల్ల మన మనోభీష్టాలు నెరవేరతాయని విశ్వాసం. ప్రదోష వ్రతం మహాదేవుడు శివుడికి అంకితం చేయబడింది. ఈ రోజున శివపార్వతులని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల సుఖసంతోషాలతో జీవిస్తారని నమ్ముతారు. బుధ ప్రదోషం రోజున చేసే శివపూజలకు కోటి రెట్ల ఫలితం ఉంటుందని శాస్త్ర వచనం.

బుధ ప్రదోష పూజ ఎలా చేయాలి
పరమ పవిత్రమైన బుధ ప్రదోషం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో, చిత్తశుద్ధితో భక్తులు ఉపవాసం ఉంటారు. ఈ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి, శుచియై శివపార్వతులను మల్లెలతో పూజించాలి. శక్తి ఉన్నవాళ్లు ఉపవాసం ఉంటే చాలా మంచిది. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో సంధ్యా దీపం వెలిగించి నమస్కరించుకోవాలి. శివాష్టకం పఠించాలి.

శివాలయంలో పూజలు ఇలా
అనంతరం శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి, అభిషేకాలు, అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు వంటివి దేవుడికి సమర్పించాలి. ప్రదోష వ్రతం కథ చదువుకోవడం లేదా వినడం చేయాలి. ఆ తర్వాత శివునికి భక్తిశ్రద్ధలతో హారతి ఇవ్వాలి. చివరగా పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇంటికి తిరిగి వచ్చాక ఉపవాసాన్ని విరమించవచ్చు.

ఈ దానాలు శ్రేష్టం
బుధ ప్రదోషం రోజు బ్రాహ్మణులకు, అన్నార్తులకు అన్నదానం చేయడం శ్రేష్టం. శక్తి ఉన్నవారు ఇతర దానాలు కూడా చేయవచ్చు.

ప్రదోష వ్రత కథ
పూర్వం ఒక నగరంలో బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమెకి భర్త చనిపోవడం వల్ల తన స్వశక్తితో కష్టపడి కొడుకులను పోషించుకుంటూ జీవనం సాగించేది. ఒకరోజు బయటకి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ బ్రాహ్మణ స్త్రీకి గాయపడిన స్థితిలో ఉన్న ఒక యువకుడు కనిపిస్తాడు. ఆమె దయతో అతనిని ఇంటికి తీసుకొచ్చి సపర్యలు చేసింది. తర్వాత ఆ కుర్రాడు విదర్భ రాకుమారుడని తెలుసుకుంటుంది. శత్రు సైనికులు అతని రాజ్యం మీద దాడి చేసి, ఆ యువకుని తండ్రిని బందీగా చేసుకుని రాజ్యాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని తెలుస్తుంది.

రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ కుమారులతో కలిసి అక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఒకరోజు అన్షుమతి అనే గంధర్వ కుమారి యువరాజుని చూసి ముగ్ధురాలు అవుతుంది. మరుసటి రోజు అన్షుమతి తన తల్లిదండ్రులతో కలిసి యువరాజుని కలుస్తుంది. కొన్ని రోజులకు శివుడు అన్షుమతి తల్లిదండ్రులకు కలలో కనిపించి వారి పెళ్లి చేయాలని ఆదేశిస్తాడు.

ప్రదోష వ్రత ప్రభావం
బ్రాహ్మణ స్త్రీ శివుడి పరమ భక్తురాలు. ప్రదోష వ్రతం తప్పనిసరిగా పాటిస్తూ వచ్చేది. ఆమె ప్రదోష వ్రత ఫలితం వల్ల అన్షుమతి తండ్రి అయిన గంధర్వ రాజు తన సైన్యంతో కలిసి యువరాజు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న విదర్భ మీద దాడి చేసి విజయం సాధిస్తాడు. శత్రువులని తరిమేసి యువరాజు తండ్రిని కూడా బంధీల నుంచి విముక్తుడిని చేస్తాడు. అందుకే ప్రదోష వ్రతం నాడు ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తే భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరతాయని నమ్ముతారు. యువరాజు ఆ బ్రాహ్మణ స్త్రీ ఆశ్రయాన్ని పొందిన తర్వాతనే తన కష్టాల నుంచి విముక్తి పొందడంతో పాటు తన తండ్రిని కూడా శత్రు రాజుల నుంచి విడిపిస్తాడు. అందుకే ప్రదోష వ్రతానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. బుధవారం రోజు రానున్న బుధ ప్రదోషం రోజు మనం కూడా ప్రదోష వ్రతాన్ని ఆచరిద్దాం, సకల శుభాలను పొందుదాం. ఓం నమః శివాయ

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details