తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

భీష్మాష్టమి రోజున తర్పణాలు సహా- ఈ దానాలు చేస్తే సంతాన ప్రాప్తి తథ్యం! - BHISHMA ASHTAMI 2025

ఘోటక బ్రహ్మచారి భీష్మునికి తర్పణాలిచ్చే భీష్మాష్టమి ప్రత్యేకత ఇదే!

Bhishma Ashtami
Bhishma Ashtami (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2025, 5:30 AM IST

Bhishma Ashtami 2025 :తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉన్న భీష్ముడు అంపశయ్య మీద ప్రాణ త్యాగం చేసిన రోజు భీష్మాష్టమి. ఈ కథనంలో భీష్మాష్టమి ఎప్పుడు? భీష్మాష్టమి ప్రత్యేకత ఏమిటి? అనే వివరాలు తెలుసుకుందాం.

భీష్మ ప్రతిజ్ఞ
శంతన మహారాజు, గంగాదేవి పుత్రుడే భీష్ముడు. స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన మహానుభావుడు. తన తండ్రి కోసం వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించిన త్యాగధనుడు. మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరఫున పోరాడి ఓడినప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై ఉండి ప్రాణాలు నిలుపుకొని మాఘ మాసం శుద్ధ అష్టమి రోజున శరీరాన్ని విడిచిన మహానుభావుడు భీష్మ పితామహుడు.

పంచప్రాణాలు అంటే ఇవే!
భారత యుద్ధం సమయంలో క్షతగాత్రుడై, దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకూ అంపశయ్యపై ఉండి మాఘ శుక్ల సప్తమి నుంచి మొదలు పెట్టి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడిచినట్లుగా చెపుతారు. భీష్ముడు అంపశయ్యపై యాభై ఎనిమిది రోజులున్నట్లు భారతంలో స్పష్టంగా ఉంది.

భీష్మాష్టమి విశిష్టత
వ్యాసమహర్షి రచించిన పద్మ పురాణంలో హేమాద్రి వ్రత ఖండంలో భీష్మాష్టమి గురించిన వివరణ ఉంది. దాని ప్రకారం, మాఘ శుక్లపక్ష అష్టమియే భీష్మ నిర్యాణ దినంగా భావిస్తారు. భీష్మాష్టమి భారత దేశమంతటా జరుపుకోవాల్సిన పర్వమని వ్రతోత్సవ చంద్రిక సూచిస్తున్నది.

భీష్మాష్టమి ఎప్పుడు?
ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం తెల్లవారు ఝాము 5:32 నిమిషాల నుంచి మరుసటి రోజు ఫిబ్రవరి 6వ తేదీ గురువారం తెల్లవారుఝాము 3:13 నిమిషాల వరకు మాఘ శుద్ధ అష్టమి తిథి ఉంది. సూర్యోదయం తిథిని అనుసరించి ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం రోజునే భీష్మాష్టమి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పూజకు శుభ ముహూర్తం. తర్పణాలు విడవాల్సిన సమయం మధ్యాహ్నం 12 గంటలు.

భీష్మునికి తిల తర్పణం
ఈ రోజు ప్రతి ఒక్కరు భీష్మునికి తర్పణం విడవాలని స్మృతి కౌస్తుభం తెలుపుతున్నది. ఘోటక బ్రహ్మచారి కనుక భీష్మునికి సంతానం లేదు. కాబట్టి భీష్ముని మన పితృదేవతగా భావించి భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఈ విధంగా తర్పణం, శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని భావన.

భీష్మాష్టమి రోజు ఇలా చేయాలి?
సూర్యోదయమునకు ముందే నిద్రలేచి నదీస్నానం చేయాలి. పూజా మందిరము, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరములను ముగ్గులతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసముండి, రాత్రి జాగారం చేయాలి.

విష్ణుపూజ
విష్ణుమూర్తి చిత్రపటాన్ని గంధం కుంకుమలతో అలంకరించాలి. తామరవత్తులతో ఆవునేతితో దీపారాధన చేయాలి. తామర పువ్వులు, తులసి దళాలు, మల్లెపూలతో విష్ణుమూర్తిని అర్చించాలి. అనంతరం విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

ఈ దానాలు శ్రేష్ఠం
ఈ రోజు బ్రాహ్మణ కుమారులకు ఒడుగు చేయడానికి అయ్యే ధనం దానంగా ఇవ్వడం సర్వశ్రేష్ఠమని శాస్త్రవచనం. అలాగే ఈ రోజు గోవుకు గ్రాసం అందించడం, పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం కూడా మంచిది. బ్రాహ్మణులకు ఛత్రదానం, పాదరక్షలు, వస్త్రదానం చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు.

సర్వే జనా సుఖినో భవంతు - లోకా సమస్తా సుఖినో భవంతు! - ఓం శాంతి శాంతి శాంతిః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details