తెలంగాణ

telangana

ఆర్థిక ఇబ్బందులు పోగొట్టే అజా ఏకాదశి వ్రతం! ఎలా చేసుకోవాలి? - Aja Ekadashi 2024

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2024, 6:01 PM IST

Aja Ekadashi Puja Vidhi : ఒక సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు విశిష్టమైనవే! ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరుంటుంది. ఈ క్రమంలో శ్రావణ బహుళ ఏకాదశిని అజా ఏకాదశిగా జరుపుకుంటాం. అజా ఏకాదశి విశిష్ట ఏమిటి? అజా ఏకాదశి పూజ ఎలా చేయాలి అనే వివరాల కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.

Aja Ekadashi 2024
Aja Ekadashi 2024 (Getty Images)

Aja Ekadashi Puja Vidhi : విష్ణు పురాణం, భవిష్య పురాణం ప్రకారం శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందాలంటే ఏకాదశి వ్రతాన్ని తప్పక ఆచరించాలి. అజా ఏకాదశి రోజు భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో లక్ష్మీ నారాయణులను పూజించడం వలన ఆర్థిక ఇబ్బందులు, పేదరికం నుంచి విముక్తి పొంది సుఖసంతోషాలను పొందుతారని విశ్వాసం.

అజా ఏకాదశి ఎప్పుడు
శ్రావణ బహుళ ఏకాదశిని అజా ఏకాదశిగా జరుపుకుంటాం. ఆగస్టు 28 వ తేదీ బుధవారం రాత్రి 1:20 నిముషాల నుంచి ఆగస్టు 29 వ తేదీ గురువారం రాత్రి 1:38 నిమిషాల వరకు ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఆగస్టు 29 వ తేదీ గురువారం రోజునే అజా ఏకాదశి వ్రతాన్ని జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.

అజా ఏకాదశి పూజకు శుభసమయం
ఆగస్టు 29 వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల లోపు అజా ఏకాదశి పూజకు శుభ సమయంగా పంచాంగ కర్తలు చెబుతున్నారు.

అజా ఏకాదశి పూజా విధానం
ఏకాదశి వ్రతానికి ఉపవాసం, జాగరణ ఎంతో ముఖ్యం. అజా ఏకాదశి వ్రతం ఆచరించే వారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ రోజు వీలైతే నదీ స్నానం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది. వీలుకాని పక్షంలో స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కలుపుకొని తలారా స్నానం చేయాలి. పూజామందిరంలో లక్ష్మీనారాయణుల విగ్రహాలను కానీ, చిత్ర పటాన్ని కానీ గంధం కుంకుమలతో అలంకరించుకొని సిద్ధం చేసుకోవాలి. ఆవునెయ్యితో దీపారాధన చేసుకొని ఈ రోజు పూర్తిగా ఉపవాసం చేస్తానని దేవుని సమక్షంలో దీక్ష తీసుకోవాలి.

పసుపు రంగు శ్రేష్టం
పసుపు రంగు విష్ణువుకు చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజు లక్ష్మీ నారాయణులను పసుపు రంగు పూలతో అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఏకాదశి రోజు చేసే విష్ణు పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలి. అనంతరం పసుపు రంగు ప్రసాదాలు అనగా శెనగలతో చేసిన గుగ్గిళ్ళు, నిమ్మకాయ పులిహోర, బూందీ లడ్డు వంటి ప్రసాదాలను నివేదించాలి. ఏకాదశి వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకోవాలి. దేవునికి నివేదించిన ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి.

సాయంత్రం పూజ
సాయంత్రం యధావిధిగా స్నానాదికాలు ఆచరించి దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలి. అనంతరం సమీపంలోని విష్ణు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. ఆ రాత్రంతా భగవంతుని కీర్తనలు, భజనలతో కాలక్షేపం చేస్తూ జాగరణ చేయాలి. ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు.

ద్వాదశి పారణ
మరుసటి రోజు ఉదయం శుచియై ద్వాదశి ఘడియలు రాగానే లక్ష్మీ నారాయణులను పూజించి ప్రసాదాలను సమర్పించి ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకోవాలి. అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు.

అజా ఏకాదశి వ్రత ఫలం
ఇలా ఎవరైతే భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో అజా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆ ఇంట పది తరాల వరకు దారిద్య్ర బాధలు ఉండనే ఉండవు. ఆ వంశమంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. రానున్న అజా ఏకాదశి వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం, సుఖసంతోషాలను పొందుదాం.

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

బలరాముడిని శనివారం ఇలా పూజిస్తే హెల్దీ లైఫ్ మీ సొంతం!- ఎలా చేయాలో తెలుసా? - Balarama Jayanti 2024

విద్యార్థులకు జ్ఞానప్రదాత హయగ్రీవుడు- సోమవారం ఇలా పూజిస్తే విద్యాబుద్ధులు పక్కా! - Hayagriva Jayanti 2024

ABOUT THE AUTHOR

...view details