Public Face to Face with Ministers : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిలు ప్రజా పాలన ద్వారా ఇందిరమ్మ రాజ్యాన్ని నిర్మించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. గాంధీభవన్లో మంత్రులు, సీఎం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండేటట్లు చూడాలని ముందు నుంచి పార్టీ నుంచి డిమాండ్ వస్తోంది. ఈ నెల 15వ తేదీన మహేశ్కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పార్టీని బలోపేతం చేసేందుకు వారంలో రెండు రోజులు మంత్రులు, రెండు వారాలకు ఒక్క రోజు సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో ఉండేట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఆ తర్వాత ఇదే అంశంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్లు దాదాపు 2 గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం చేపట్టాలన్న ఆలోచన రావడం కూడా మంచి శుభపరిణామమని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది. ఇది పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తుందని అభిప్రాయపడినట్లు పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులతో కూడా చర్చించిన తర్వాత ఈ సరికొత్త సంప్రదాయానికి నాంది పలుకుతున్నట్లు పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు ప్రతి రోజు గాంధీభవన్లో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. పూర్తిస్థాయి పీసీసీ అధ్యక్షుడు కావడంతో పార్టీని బలోపేతం చేయడం ఎలా? కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే దానిని ఏ విధంగా పరిష్కారం చేయాలి? తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
గాంధీ భవన్లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం ఈ నెల 25 (రేపటి) నుంచి అందుబాటులోకి వస్తుందని పీసీసీ ప్రకటించింది. వారంలో ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం గాంధీభవన్లో ఓ మంత్రి అందుబాటులో ఉంటారు. ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రోజుకు 3 గంటలు అందుబాటులో ఉంటారు. ఈ కార్యక్రమం రేపటి నుంచి గాంధీభవన్లో మొదలు కానుంది. తాత్కాలికంగా ఈ కార్యక్రమాన్ని మంత్రులతో ప్రజల ముఖాముఖిగా నామకరణం చేశారు.