తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా ? : కేటీఆర్ - KTR Fires on Congress Assurances

KTR Fires on Congress Assurances : నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చకుండా నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ సర్కారును, ఈ పాపం శాపమై భూస్థాపితం చేయడం ఖాయమని కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్​లో ట్వీట్​ చేసిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డికి యువతపై ప్రేమ లేదని, నిరుద్యోగులు అంటే అసలే గౌరవం లేదని విమర్శించారు.

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 8:23 PM IST

Updated : Jul 5, 2024, 9:01 PM IST

BRS Leader KTR Tweet on CM Revanth
KTR Comments on CM Revanth (ETV Bharat)

KTR Fires on CM Revanth Over Unemployment :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యువతపై ప్రేమ లేదని, నిరుద్యోగులు అంటే అసలే గౌరవం లేదని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన నయవంచక సర్కారు ఇదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా అని ఆయన ప్రశ్నించారు.

తెల్ల దొరల పాలన కన్నా, దుర్మార్గంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఓ వైపు ప్రజా పాలన అంటారు. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి యువతను అక్రమంగా అరెస్టు చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంతటి నిరంకుశ విధానాలను అవలంభిస్తారా అని అడిగారు. ఇది ప్రజా పాలన కాదని, ముమ్మాటికీ ప్రజాకంఠక పాలన అని మండిపడ్డారు.

నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు క్షమాపణలు చెప్పాలి : ప్రచారంలో ఒక మాట, ప్రభుత్వంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్న సీఎం, రెండు నాల్కల వైఖరి తెలంగాణ యువతకు అర్థమైపోయిందని అన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన వారందరిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఉద్యోగ నియామకాలు చేపట్టడంలో, జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, వెంటనే నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు క్షమాపణలు చెప్పాలని అన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చకుండా నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ సర్కారును ఈ పాపం శాపమై భూస్థాపితం చేయడం ఖాయమని పేర్కొన్నారు.

BRS Student Strike in Telangana Against Government :ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం తన మెుండివైఖరి వీడాలంటూ పలు విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు రోడెక్కి ఆందోళన చేపట్టారు. గ్రూప్-2, గ్రూప్‌-3 ఉద్యోగాల భర్తీలో పోస్టులను పెంచాలని, గ్రూప్-1మెయిన్స్ 1:100 నిష్పత్తి అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలన్న తదితర డిమాండ్లపై పలు విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చాయి. నిరుద్యోగ సంఘాలు ఇచ్చిన మార్చ్‌ను దృష్టిలో పెట్టుకొని, హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

టీజీపీఎస్సీ వద్ద బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం బీఆర్ఎస్వీ ఆందోళన నిర్వహించింది. డీఎస్సీని 3 నెలలపాటు వాయిదా వేయాలని, అక్టోబర్‌లో 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ టీజీపీఎస్సీని ముట్టడించింది. రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకూ పోరాటం ఆపమని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ అన్నారు.

గ్రూప్స్‌ పరీక్షల్లో మార్పులు చేయాలంటూ రోడ్డెక్కిన విద్యార్థి సంఘాలు - అరెస్ట్ చేసిన పోలీసులు - Students Strike in Telangana

'అప్పుడు ములాఖత్​లు - ఇప్పుడు ముఖం తిప్పుడు' - నిరుద్యోగులపై కాంగ్రెస్​ డబుల్ స్టాండర్డ్స్ - BRS ON STUDENT LEADERS ARREST

Last Updated : Jul 5, 2024, 9:01 PM IST

ABOUT THE AUTHOR

...view details