Janasena Petition In AP High Court :స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తమకు కేటాయించిన గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించొద్దంటూ జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని ఈసీకి వినతి పత్రం ఇచ్చామని జనసేన పార్టీ తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. రెండోసారి కూడా ఎన్నికల అధికారికి వినతిపత్రం ఇచ్చినా ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదన్నారు. టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న కారణంగా 2 ఎంపీ, 21 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మిగతా సీట్లలో తమతో పొత్తులో ఉన్న టీడీపీ, బీజేపీ పోటీ చేస్తున్నాయని, ఆ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని కోరామన్నారు. గాజు గ్లాసు గుర్తును స్వతంత్య్ర అభ్యర్థికి కేటాయించటం వల్ల కూటమికి నష్టం వస్తుందన్నారు. జనసేన ఇచ్చిన అభ్యర్ధనపై 24 గంటల్లో ఈసీ నిర్ణయం ఉంటుందని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. మరోవైపు ఈ వ్యాజ్యంలో టీడీపీ సైతం వాదనలు వినిపించేందుకు అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది.
వేరే పార్టీకి గాజు గ్లాస్ గుర్తు: సీఈసీకి భాజపా-జనసేన ఫిర్యాదు