తెలంగాణ

telangana

రాష్ట్రం అప్పులపై సీఎం పదే పదే అబద్ధాలు చెబుతున్నారు : హరీశ్​రావు - Harish Rao on CM Revanth

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 9:14 PM IST

Harish Rao on Cm Revanth Reddy : రాష్ట్రం అప్పుల పాలైందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్​లో బీఆర్​ఎస్​ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఏర్పడగా సీఎం రేవంత్ పదే పదే అబద్ధాలు చెబుతున్నారన్నారని ఆరోపించారు.

Harish Rao on Cm Revanth about Telangana Debt
Harish Rao on Cm Revanth Reddy (ETV Bharat)

Harish Rao on Cm Revanth about Telangana Debt : రాష్ట్రంలో అప్పుల పాలైందన్న ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి వ్యాఖ్యల పట్ల మాజీమంత్రి హరీశ్​రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఏర్పడిందని, సీఎం రేవంత్​ పదేపదే అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. 16వ ఆర్థిక సంఘం ముందు సైతం అబద్ధాలను చెప్పడం సిగ్గు చేటన్నారు. మంగళవారం మెదక్​లో బీఆర్​ఎస్​ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాల్సిన ముఖ్యమంత్రే తెలంగాణ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు.

రాష్ట్రం దివాలా తీసిందని, ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు ముఖ్యమంత్రే చెప్పడం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే అని హరీశ్​రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.6.85 లక్షల కోట్ల అప్పుందనే తప్పుడు ప్రచారాన్ని ఇంకెన్నిసార్లు, ఇంకెన్ని రోజులు చేస్తారని సీఎం రేవంత్​ను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. ప్రచార సభల్లో, 16వ ఆర్థిక సంఘం ముందు, చివరికి ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాల్లో కూడా అదే తొండి వాదన వినిపించడం వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏముందని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే రాష్ట్ర అప్పుల విషయంలో సీఎం రేవంత్​ చేసిన తప్పుడు ప్రచారన్ని తిప్పి కొడుతూ వాస్తవాలు వెల్లడించానని తెలిపారు.

గత తొమ్మిదేళ్లలో తెలంగాణ దేశంలోనే తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో నిలిచిన విషయాన్ని ఎందుకు చెప్పరు. రాష్ట్రం దివాలా తీసిందన్న మీ మాటలు విని పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తారా? రాజకీయ కక్షల కోసం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తారా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మీ బాధ్యత లేని వ్యాఖ్యల వల్ల ఇప్పటికే పలు కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయి'-హరీశ్​రావు, మాజీమంత్రి

రూ.6.85 లక్షల కోట్ల అప్పు అంటూ ప్రచారం : తొమ్మిదిన్నరేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో అభివృద్ధి, మూలధన పెట్టుబడి, సంక్షేమాల కోసం చేసిన అప్పు రూ. 4,26,499 కోట్లు మాత్రమే అని అసెంబ్లీ వేదికగా ఆన్​రికార్డ్​గా వివరించానని హరీశ్​రావు పేర్కొన్నారు. అయినా రూ.6.85 లక్షల కోట్ల అప్పు అంటూ రాష్ట్రం దివాలా తీసింది అంటూ రాష్ట్రానికి శాపం పెట్టడం ఎంత వరకు సమంజసం అని ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దివాలా కోరు వ్యాఖ్యలు, చేతగాని తనం కారణం కాదా? అని ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపు కోసం రాష్ట్ర ప్రయోజనాలను సైతం పణంగా పెట్టే గొప్ప ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.

సంక్షోభ హాస్టళ్లుగా సంక్షేమ వసతిగృహాలు, సమస్యలకు నిలయాలుగా గురుకులాలు- సీఎంకు హరీశ్‌రావు లేఖ - Harish Rao On CM Revanth

ABOUT THE AUTHOR

...view details