BRS MP Candidate Vinod Kumar On Bandi Sanjay :తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పనులకు అనుమతులు తీసుకువచ్చిన తర్వాతే ఇచ్చంపల్లి ప్రాజెక్టుపై బండి సంజయ్ మాట్లాడాలని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇచ్చంపల్లిలో నిర్మించబోయే ప్రాజెక్టుకు ఇంటర్ లింక్స్ ఇవ్వకుండా పనులు ఎట్లా ప్రారంభిస్తారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ బండి సంజయ్ను ప్రశ్నించారు. ఇప్పటికే నదుల అనుసంధానానికి కేంద్రం కసరత్తు చేస్తోందని, నదుల అనుసంధానంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగనుందని వినోద్ ఆక్షేపించారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తేల్చాలన్న ఆయన, పెండింగ్లో ఉన్న సమ్మక్క సారక్క, సీతరామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆ తర్వాతే నదుల అనుసంధానం, ఇచ్చంపల్లి గురించి ఆలోచించాలని అన్నారు.
"మీ ఎంపీ బాధ్యతలను సక్రమంగా ఉపయోగించి, ప్రజాభివృద్ధికై దిల్లీలో తిరగాలి. వివిధ మంత్రిత్వ శాఖల వద్దకు వెళ్లి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికోసం పాటుపడాలి. కానీ మీరు(బీజేపీ నలుగురు ఎంపీలు) ఏమిచేస్తున్నారు. ప్రాజెక్టుల విషయంలో పూట్లు పొడుస్తున్నారు. ఇప్పటికైనా దయచేసి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల అనుమతి ఇచ్చేలా మీరు చొరవ తీసుకోవాలి."-వినోద్ కుమార్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి
గోదావరి జలాలు తరలిస్తే ఉత్తర తెలంగాణ పరిస్థితి ఏంటి? : తెలంగాణకు వచ్చే జలాలను కొల్లగొట్టేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని దుయ్యబట్టారు. గోదావరి నది జలాలు తరలించుకుపోతే ఉత్తర తెలంగాణ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల వాతావరణంలో ఎవ్వరు పట్టించుకోరనే ఇప్పుడు ఎంవోయు విడుదల చేశారని ఆయన మండిపడ్డారు.