తెలంగాణ

telangana

ఒకటో తేదీన వేతనాల చెల్లింపు ఉత్తమాటే : హరీశ్​రావు - Harish Rao on Employees Salaries

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 8:42 PM IST

Harish Rao on Employees Salaries : రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాల చెల్లింపు ఉత్తమాటేనని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్​రావు ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందే కానీ ఆచరణలో అలసత్వం ప్రదర్శిస్తోందని ఆయన మండిపడ్డారు. అభయహస్తం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా గెస్ట్ లెక్చరర్లకు భరోసా ఇవ్వడంతో పాటు, నెలకు రూ.42 వేల వేతనం చెల్లించి, విద్యాసంవత్సరం చివరి వరకు ఉద్యోగ కాలాన్ని పొడిగించాలని హరీశ్​రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

BRS Leader Harish Rao Fires on Congress Party
Harish Rao on Employees Salaries (ETV Bharat)

BRS Leader Harish Rao on Employees Salaries :ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోందని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు ఆక్షేపించారు. మోడల్ స్కూల్ టీచర్స్​కు గత ఏడు నెలల నుంచి కూడా ఒకటో తేదీన వేతనాలు చెల్లించకపోవడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమని దుయ్యబట్టారు.

ఈ నెలలో ఇప్పటి వరకు 13 రోజులు గడిచినప్పటికీ మోడల్ స్కూల్స్ రెగ్యులర్ టీచర్స్ జీతాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎనిమిదో తేదీన సగం మంది ఉద్యోగులకు మాత్రమే వేతనాలు చెల్లించిన సర్కారు, రంగారెడ్డి, నిజామాబాద్, వనపర్తి, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, పెద్దపల్లి తదితర జిల్లాలో పని చేస్తున్న వెయ్యి మందికి పైగా రెగ్యులర్ టీచర్స్​కు ఇంకా వేతనాలు చెల్లించలేదని హరీశ్​రావు తెలిపారు.

ఉపాధ్యాయులకు ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలి :మోడల్ స్కూల్స్​లో పనిచేసే అవుట్​ సోర్సింగ్, హవర్లీ బేస్డ్ టీచర్స్ దాదాపు రెండు వేల మందికి ప్రభుత్వం ఇంకా వేతనాలు చెల్లించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, ఉపాధ్యాయులను గౌరవించి ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని బీఆర్​ఎస్​ పక్షాన డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేసే గెస్ట్ లెక్చరర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పడం బాధాకరమని ఆయనన్నారు.

అధికారంలోకి రాగానే 42 వేల రూపాయల వేతనం చెల్లిస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ, వారి ఉద్యోగ భవిష్యత్​ను దెబ్బతీసేలా కేవలం మార్చి 31 నుంచి జులై 31 వరకే కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గమని మాజీ మంత్రి మండిపడ్డారు. ఏప్రిల్, మే నెలల్లో సెలవులే ఉండగా, కేవలం జూన్, జులై నెలకు మాత్రమే పొడిగింపు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని ఆక్షేపించారు.

Harish Rao Fires on Congress Govt : ఈ నిర్ణయంతో గత పదేళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం మధ్యలో ఉద్యోగాలు నిలిపివేస్తే, బతికేది ఎలా అని లెక్చరర్లు, వారి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయని హరీశ్​రావు పేర్కొన్నారు. గతంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రతి విద్యాసంవత్సరానికి పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు.

గెస్ట్ లెక్చరర్ల వ్యవస్థను ఎత్తేసేందుకు కుట్ర చేస్తున్నట్లు వారు ఆందోళనలో ఉన్నారని, ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అభయహస్తం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా గెస్ట్ లెక్చరర్లకు భరోసా ఇవ్వడంతో పాటు, నెలకు రూ.42 వేల వేతనం చెల్లించి, విద్యాసంవత్సరం చివరి వరకు ఉద్యోగ కాలాన్ని పొడగించాలని హరీశ్​రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

'ప్రభుత్వాన్ని విమర్శిస్తే కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటారా' - డీజీపీకి మాజీ మంత్రుల ట్వీట్​ - KTR and Harish on Police Behavior

విద్యా వ్యవస్థలో సమస్యలే లేవని విద్యాశాఖ ప్రకటించడం సరికాదు : హరీశ్‌రావు - Harish Comments on Education Dept

ABOUT THE AUTHOR

...view details