BJP Public Meeting At Saroornagar : తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం అవుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలపై కిషన్ రెడ్డి సారథ్యంలోని బీజేపీ పోరాటం చేసిందని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతు, మహిళా, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని నడ్డా ఆక్షేపించారు. హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ తలపెట్టిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
"రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తోంది. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడిన పార్టీ హస్తం పార్టీ. బీజేపీతో నేరుగా తలపడ్డ ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. రేవంత్ సర్కారు ఏడాది పాలనలో అన్ని వర్గాలను మోసం చేసింది. ఆటో డ్రైవర్లకు 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసింది. ఎన్నికల సమయంలో ఆ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. అన్నదాతలకు ఇవ్వాల్సిన రూ.15వేల రైతు భరోసా ఇవ్వలేదు. రైతు కూలీలకు 12 వేలు ఇస్తామని చెప్పి మాట తప్పింది. ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామని చెప్పి ఇవ్వలేదు"- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు