How to Make Uttarandhra Special Shivangi Pulusu: "శివంగి పులుసు.." పేరు మాత్రమే కాదు టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ఉత్తరాంధ్ర సంప్రదాయపు వంటకమైన ఈ పులుసు.. తినే కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, పుల్కా, రోటీ.. ఇలా ఏదైనా ఈ పులుసు చాలా చక్కగా ఉంటుంది. ఈ పులుసు ప్రిపేర్ చేయాలంటే ఏవేవో పదార్థాలు అవసరం లేదు. కేవలం ఇంట్లో లభించే పదార్థాలతోనే నోరూరించే పులుసు రెడీ చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
మసాలా కోసం:
- మినప గుండ్లు - ఒక చెంచా
- పచ్చి శనగపప్పు - ఒక చెంచా
- ధనియాలు - రెండు చెంచాలు
- తెల్ల నువ్వులు - 2 చెంచాలు
- బెల్లం ముక్క – చిన్నది
- జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
- మెంతులు - అర చెంచా
- ఆవాలు - 1 చెంచా
- ఎండు కొబ్బరి ముక్కలు - 2 చెంచాలు
- ఎండు మిరపకాయలు - 6
- పల్లీలు - 2 చెంచాలు
- చింతపండు - నిమ్మకాయ సైజంత
- నీరు - తగినన్ని
- గుత్తి వంకాయలు - 12
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - 3 చెంచాలు
- పసుపు - 1 చెంచా
తాళింపు కోసం:
- నెయ్యి - 3 చెంచాలు
- ఆవాలు - 1 చెంచా
- జీలకర్ర – 1 చెంచా
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఇంగువ – చిటికెడు
మటన్ ఎప్పుడూ కావొద్దు రొటీన్! - ఈ సారి దోసకాయ మటన్ కర్రీ చేయండి - సరికొత్త రుచిని ఆస్వాదిస్తారు
తయారీ విధానం:
- ముందుగా చింతపండును ఓ గిన్నెలోకి తీసుకుని కొన్ని నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పల్లీలు వేయించుకుని తీసుకోవాలి. అదే పాన్లో ఎండు మిరపకాయలు, ఎండుకొబ్బరి ముక్కలను విడివిడిగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత ధనియాలు దోరగా వేయించుకోవాలి. అలాగే పచ్చి శనగపప్పు, మినపప్పును కలిపి దోరగా వేయించుకుని తీసుకోవాలి.
- అదే పాన్లో తెల్ల నువ్వులు వేసి చిటపటలాడిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర కూడా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు వీటన్నింటిని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. రోట్లో దంచుకుంటే రుచి మరింత బాగుంటుంది.
- ఇప్పుడు ఓ గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకుని పసుపు, ఉప్పు వేసుకుని కరిగించుకోవాలి. ఆ తర్వాత అందులోకి గుత్తి వంకాయలకు నాలుగు గాట్లు పెట్టి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని పసుపు నీళ్లలో వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలను కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి హీట్ చేసుకోవాలి. అందులోకి కట్ చేసుకున్న వంకాయలను వేసి కలిపి మూత పెట్టి ఓ నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి పసుపు వేసి కలిపి వెంటనే చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఆ తర్వాత ఓ గ్లాసు నీళ్లు పోసుకుని కలిపి మూత పెట్టి ఓ 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
- ఆ తర్వాత మూత తీసి మరోమారు కలిపి ముందే ప్రిపేర్ చేసుకున్న పొడిని కావాల్సినంత పరిమాణంలో తీసుకోవాలి. అంటే సుమారుగా 70 శాతం క్వాంటిటీలో తీసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని.. పులుపుకు సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పులుపు సరిపడా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కారం సరిపోకపోతే మిగిలిన పొడిని కొద్దిమేర కలుపుకోవచ్చు.
- ఇప్పుడు మూత పెట్టి మరో మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పులుసు చిక్కబడిన తర్వాత దింపేసుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, ఇంగువ వేసి కలిపి దింపేసుకుని.. ఈ తాళింపును పులుసులో కలుపుకుంటే ఘుమఘుమలాడే ఉత్తరాంధ్ర స్పెషల్ శివంగి పులుసు రెడీ!!
ఫిష్ పులుసు పెట్టాలంటే చేపలే ఉండాలా ఏంటి? - వీటితో పులుసు పెడితే వహ్వా అనాల్సిందే!
మటర్ పనీర్ గ్రేవీని సింపుల్గా చేసుకోండిలా - టేస్ట్ అద్దిరిపోతుంది!