Trump Tariffs On Mexico :అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాకు తాత్కాలిక ఊరట లభించింది. సుంకాల విధింపును నెల రోజుల పాటు నిలిపివేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్తో స్నేహపూర్వక ఫోన్ కాల్ తర్వాత ఈ మేరకు అంగీకారానికి వచ్చినట్లు ట్రంప్ చెప్పారు. ఇదే విషయాన్ని తన సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు.
సుంకాల అంశంపై రెండు దేశాల మధ్య తదుపరి చర్చలు ఉంటాయని ట్రంప్ తెలిపారు. ఫోన్కాల్ విషయాన్ని మెక్సికో అధ్యక్షురాలు షీన్బామ్ ఎక్స్ వేదికగా తెలిపారు. మెక్సికో నుంచి అమెరికాకు మాదకద్రవ్యాలు, ముఖ్యంగా ఫెంటానిల్ అక్రమ రవాణా, అక్రమ వలసదారుల చొరబాట్లను కట్టడి చేసేందుకు వెంటనే 10 వేల మంది సైన్యాన్ని ఉత్తర సరిహద్దుకు తరలించనున్నట్లు షీన్బామ్ తెలిపారు. అందుకోసం బోర్డర్ పాలసీలలో పలు మార్పులు చేసినట్టు చెప్పారు.
అగ్రరాజ్యం సైతం మెక్సికోకు ఆయుధాల అక్రమ రవాణా నిరోధానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించిందన్నారు ట్రంప్. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. సరిహద్దు భద్రతపై చర్యలు తీసుకుంటామని ఆయన ట్రంప్నకు హామీ ఇచ్చారు. మరోవైపు నేటి నుంచి సుంకాల విధింపు అమల్లోకి రానున్న నేపథ్యంలో చైనా దిగుమతులపై అమెరికా టారిఫ్ విధించే అవకాశం ఉంది.
అయితే తాజా నిర్ణయంపై ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిస్తూ హర్షం వ్యక్తంచేశారు. "అధ్యక్షుడు ట్రంప్తో మంచి సంభాషణ జరిగింది. సరిహద్దుల భద్రత కోసం 1.3 బిలియన్ డాలర్ల ప్రణాళికను అమలుచేస్తున్నాం. అమెరికన్ బలగాల భాగస్వామ్యంతో సరిహద్దుల్లో కొత్త సాంకేతికతను అమలుచేస్తాం. సిబ్బందిని పెంచుతాం. కొత్త ఛాపర్లను మోహరిస్తాం. ఫెంటనిల్ రవాణాను ఆపేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటాం. సరిహద్దు రక్షణ కోసం 10వేల మంది బలగాలు పంపిస్తాం. దీంతోపాటు ఫెంటనిల్ జార్ను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ మత్తు పదార్థాన్ని సరఫరా చేసేవారిని ఉగ్రవాదులుగా పరిగణిస్తాం. వ్యవస్థీకృత నేరాలు, మనీలాండరింగ్, ఫెంటనిల్పై పోరాటానికి కెనడా-యూఎస్ జాయింట్ స్ట్రయిక్ ఫోర్స్ను ఏర్పాటుచేస్తాం. మేం కలిసి పనిచేసే వరకు ప్రతిపాదించిన టారిఫ్లు కనీసం 30 రోజుల పాటు నిలిపివేసేందుకు అంగీకారం కుదిరింది" అని ట్రూడో రాసుకొచ్చారు.