తెలంగాణ

telangana

ప్రధాని పీఠాన్ని కూల్చిన రిజర్వేషన్ల రగడ - బంగ్లాదేశ్​లో షేక్‌ హసీనా కథ ముగిసిందా? - Bangladesh Violence

By ETV Bharat Telugu Team

Published : Aug 5, 2024, 7:33 PM IST

Sheikh Hasina Political Career : బంగ్లాదేశ్​కు ఎక్కువ కాలం పాలించిన నేతగా నిలిచిన షేక్​ హసీనా అనుహ్య రీతిలో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతియుతంగా మొదలైన నిరసనలు చివరికి షేక్​ హసీనా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లే వరకు దారీతీశాయి.

Sheikh Hasina Political Career
Sheikh Hasina Political Career (ANI)

Sheikh Hasina Political Career : బంగ్లాదేశ్‌ జాతిపిత షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ కుమార్తె, దాదాపు 20 ఏళ్లు బంగ్లాదేశ్‌ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన షేక్‌ హసీనా అనుహ్య రీతిలో రాజీనామా చేయాల్సి వచ్చింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో ఆమె తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకుని దేశం వీడక తప్పలేదు. 1996లో తొలిసారి బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆమె దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా యత్నించారు. తర్వాత 2009లో తిరిగి బాధ్యతలు చేపట్టిన షేక్‌ హసీనా సోమవారం పదవికి రాజీనామా చేసే వరకు ఆ దేశ ప్రధానిగా కొనసాగారు. షేక్ హసీనా హయాంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి.

షేక్‌ హసీనా ఎక్కువ కాలం బంగ్లాదేశ్​ను పాలించిన నేతగా నిలిచారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ఓ ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా హసీనా నిలిచారు. బంగ్లాదేశ్‌కు తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ముజిబుర్ రెహ్మాన్ 1975లో హత్యకు గురయ్యారు. ఆయనతో పాటు షేక్ హసీనా తల్లిని, ముగ్గురు సోదరులను కొందరు సైనికాధికారులు హత్య చేశారు. ఈ హత్యలు జరిగినప్పుడు హసీనా బంగ్లాదేశ్‌లో లేరు. ఆ సమయంలో హసీనా ఆరేళ్లు ప్రవాసంలో ఉండి అవామీ లీగ్ పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు.

పలుమార్లు గృహనిర్బంధం
1981లో బంగ్లాదేశ్ తిరిగి వచ్చాక రాజకీయాల్లో కీలక నాయకురాలిగా ఎదిగారు. ఈ క్రమంలోనే పలుమార్లు గృహనిర్బంధానికి గురయ్యారు. 1990 డిసెంబర్‌లో ప్రజల ఒత్తిడికి తలొగ్గిన బంగ్లాదేశ్ చివరి సైనిక పాలకుడు లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఎర్షాద్ రాజీనామా చేశారు. 1991లో జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో షేక్ హసీనా పార్టీ బరిలో నిలిచినప్పటికీ ఆధిక్యం దక్కలేదు. ఆమె ప్రత్యర్థి ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఖలీదాజియా పార్టీ ఎన్నికల్లో నిజాయితీగా వ్యవహరించలేదనీ హసీనా పార్లమెంటును బహిష్కరించారు. ఆ తర్వాత పలు హింసాత్మక ఘటనలు చెలరేగడం వల్ల చాలా కాలం రాజకీయ గందరగోళం నెలకొంది.

మొదటి పదవీకాలంలో రాజకీయ గందరగోళం
1996 జూన్‌లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించగా, హసీనా తొలిసారి బంగ్లాదేశ్ ప్రధాని అయ్యారు. దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా శ్రమించారు. బంగ్లాదేశ్‌ ఆర్థికంగా వృద్ధి చెందేందుకు కృషి చేశారు. పేదరికాన్ని తగ్గించేందుకు యత్నించారు. హసీనా మొదటి పదవీకాలం రాజకీయ గందరగోళం మధ్యే సాగింది. 2001 అక్టోబరులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్​పీ, మూడు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలతో అవామీ లీగ్‌ను ఓడించింది. దీంతో హసీనా పదవిని కోల్పోయారు.

ప్రాణాలతో బయడపడిన హసీనా!
పదవిలో లేని క్రమంలో 2004 ఆగస్టులో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీపై గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. ఆ దాడి నుంచి హసీనా ప్రాణాలతో బయటపడ్డారు. ఇక 2008 డిసెంబరులో బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో 300 స్థానాలకుగాను 250కి పైగా స్థానాల్లో హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ జయకేతనం ఎగరవేసింది. 2009 జనవరిలో ప్రధానిగా హసీనా ప్రమాణం చేసి రెండో సారి బాధ్యతలు చేపట్టారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలను బీఎన్​పీ బహిష్కరించింది . ఆ ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించడం వల్ల హసీనా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచి నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

ఐదోసారి ప్రధానిగా బాధ్యతలు
ఈ ఏడాది జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బీఎన్​పీ సహా దాని మిత్రపక్షాలు బహిష్కరించాయి. దీంతో అధికార అవామీ లీగ్ పార్టీ మూడింట రెండొంతుల స్థానాలను సాధించింది. మొత్తం 300 సీట్లలో 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్‌ 200సీట్లను కైవసం చేసుకొని వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చింది. 2018లో జరిగిన ఎన్నికల్లో 80 శాతం ఓటు హక్కు వినియోగించుకోగా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కేవలం 40 శాతం మందే ఓటేశారు. హసీనా ఐదోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అయితే హసీనా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలుమార్లు బంగ్లాదేశ్‌లో ఘర్షణలు జరిగాయి. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో గత నెలలో పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో హసీనా పదవికి రాజీనామా చేయడం సహా దేశం వీడాల్సిన పరిస్థితి తలెత్తింది. షేక్‌ హసీనా 2009లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరవాత భారత్‌-బంగ్లాదేశ్‌ ద్వైపాక్షిక సంబంధాలు ఎంతగానో బలపడ్డాయి. అంతకుముందు ఖలీదా జియా సర్కారు పూర్తిగా భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించేది.

బంగ్లాదేశ్​లో మళ్లీ హింస- 100మంది మృతి- 14మంది పోలీసులు కూడా - Bangladesh Violence

అల్లర్లతో అట్టుడుకుతున్న బంగ్లా- మరో 8మంది మృతి- చర్చలకు సిద్ధమంటున్నా కూడా! - Bangladesh Violence

ABOUT THE AUTHOR

...view details