Pakistan New Government :పాకిస్థాన్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృతంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్, బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఈ మేరకు జరిగిన చర్చల్లో అధికార పంపకంపై కొన్ని కీలక ప్రతిపాదనలు ముందుకొచ్చాయని తెలుస్తోంది. తమ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీకి ప్రధాని పదవి కావాలని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ గట్టి పట్టుబడినట్లు సమాచారం. ప్రధాని పదవిని మూడేళ్లు PML-N, రెండేళ్లు పీపీపీ పంచుకోవాలన్న ప్రతిపాదనపైనా కసరత్తు జరుగుతోందని బిలావల్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని పగ్గాలను ఏ పార్టీ ముందు స్వీకరించాలన్న విషయంపై స్పష్టత రాలేదని తెలుస్తోంది
మూడు స్థానాలను వదులుకున్న పార్టీలు
మరోవైపు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకు జరిగిన ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ మూడు పార్టీలు సింధ్ ప్రావిన్స్లోని మూడు స్థానాలను వదులుకుంటున్నట్లు ప్రకటించాయి. అయితే రిగ్గింగ్ ఆరోపణలను ఆ దేశ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. సింధ్ ప్రావిన్స్లో తాను పోటీ చేసిన నియోజకవర్గం నుంచి పీటీఐ పార్టీ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి గెలిచారని జమాత్-ఇ-ఇస్లామీ పార్టీ సీనియర్ నాయకుడు హఫీజ్ నయీమూర్ రెహ్మాన్ తెలిపారు. అనేక నియోజకవర్గాల్లో జరిగిన రిగ్గింగ్ను ఎత్తిచూపేందుకు తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు. తమకు తక్కువ ఓట్లు వచ్చాయని పాకిస్థాన్ ఎన్నికల సంఘం వివరించిందని తెలిపారు. తమ బృందం అంచనాల ప్రకారం పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి సైఫ్ భారీ ఓట్లను 31 వేల నుంచి 11 వేలకు తగ్గించారని ఆరోపించారు. అయితే పీఎస్-129 నియోజకవర్గం నుంచి నయీమూర్ 26 వేల 296 ఓట్ల మెజారిటీతో గెలిచారని పాక్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల లెక్కింపులో అవకతవకల నేపథ్యంలో సింధ్ ప్రావిన్స్లోని రెండు స్థానాలను వదులుకుంటున్నట్లు గ్రాండ్ డెమోక్రాటిక్ అలయెన్స్ చీఫ్ షా రశీది తెలిపారు.