Hezbollah Vs Israel War : హెజ్బొల్లా- ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది. ఆదివారం ఉదయం లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్పైకి 100కు పైగా రాకెట్లు దూసుకొచ్చి విధ్వంసం సృష్టించాయి. చాలా క్షిపణులను ఇజ్రాయెల్ మిస్సైల్స్ గాల్లోనే పేల్చివేశాయి. ఆ క్షిపణులకు సంబంధించిన శిథిలాలు హైఫా, నజారెత్ ప్రాంతాల్లో పడ్డాయి. హైఫా, రమత్ డేవిడ్ వైమానిక సైనిక స్థావరాలే లక్ష్యంగా ఫాది 1, ఫాది 2 మిస్సైల్స్ ప్రయోగించినట్లు హెజ్బొల్లా తెలిపింది. బీరుట్లో ఐడీఎఫ్ వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది.
400 లక్ష్యాలపై దాడులు
రాకెట్ దాడుల ఘటనల్లో హైఫాతో పాటు లోవర్ గెలీలీ ప్రాంతాల్లో మొత్తం ముగ్గురు పౌరులు గాయపడ్డట్లు ఇజ్రాయెల్ తెలిపింది. పలు భవంతులు దెబ్బతిన్నాయని, కార్లు దగ్ధమయ్యాయని పేర్కొంది. రాకెట్లు దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని చాలా ప్రాంతాల్లో సైరన్లు మోత మోగింది. హెజ్బొల్లా రాకెట్ దాడుల వేళ, గోలన్హైట్స్ సహా నార్త్ ఇజ్రాయెల్ పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రజలు గుమిగూడి ఉండకూడని స్పష్టం చేసింది. అటు లెబనాన్ సరిహద్దు గ్రామాల్లో ఐడీఎఫ్ బలగాలు భారీ కాల్పులకు పాల్పడుతూ బీరుట్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక్క రోజులోనే హెజ్బొల్లాకు చెందిన వేలాది రాకెట్ లాంఛర్లు సహా 400 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.