Jaishankar On Terrorism :సరిహద్దుల వెంబడి ఉగ్రవాదం, తీవ్రవాదం ఉంటే దేశాల మధ్య సహకారం వృద్ధి చెందే అవకాశం లేదని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన ఇస్లామాబాద్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సులో భారత ప్రతినిధి బృందానికి జైశంకర్ సారథ్యం వహించారు. ఈ సమావేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేస్తూ- పరోక్షంగా ఆతిథ్య దేశానికి చురకలు అంటించారు.
'సరిహద్దుల్లో తీవ్రవాదం, ఉగ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలు కొనసాగుతుంటే ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, కనెక్టివిటీ వంటి తదితర రంగాల్లో సహకారం వృద్ధి చెందదు. నమ్మకం, సహకారం, స్నేహం లోపిస్తే ఆ దేశాలతో సంబంధాలు దూరమవుతాయి. అలాంటప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాటిని పరిష్కరించుకోవడానికి కారణాలు కచ్చితంగా ఉంటాయి. సహకారానికి దేశాల మధ్య పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వంపై ఆధారపడి ఉండాలి. అందుకు నమ్మకం చాలా ముఖ్యం. సభ్య దేశాల ప్రాదేశిక సమగ్రత, సారభౌమత్వాన్ని గుర్తించుకోవాలి. అందరూ కలిసి ఐక్యంగా ముందుకుగా సాగితేనే ఎస్సీఓ సభ్య దేశాలు ఎంతో ప్రయోజనం పొందుతాయి' అని జైశంకర్ అన్నారు.