Health Risks of Poor Sleep : ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 8 గంటలపాటైనా నిద్ర ఉండాలంటున్నారు నిపుణులు. అయితే, ఈ రోజుల్లో ఉద్యోగం, ఇతరత్ర పనులు, మానసిక సమస్యలతో కొంత మంది సరిగా నిద్రపోరు. ఇక గంటల తరబడి సోషన్ మీడియాలో ఉండేవారి సంగతి చెప్పనక్కర్లేదు. అలాంటి వాళ్లు నిద్రపోవడానికన్నా సోషన్ మీడియాలో పోస్టులు పెట్టడం, వీడియోలు చూడటంలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇలా నిద్రలేమితో జీవితాన్ని కొనసాగిస్తే కొన్ని రోజుల్లో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుదంటున్నారు పరిశోధకులు. ఈ నేపథ్యంలో నిద్రలేమి సమస్యలపై ఒట్టి అనే మ్యాట్రసెస్ సంస్థ- మెడిసిన్ డైరెక్ట్ అనే సంస్థతో కలిసి ఓ పరిశోధనను నిర్వహించింది. నిద్రలేమితో ఉంటే ఎన్ని రోజులకు శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో వెల్లడిస్తూ ఓ నివేదిను వెల్లడించింది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
24 గంటలు మించితే :24 గంటలకు మించి నిద్రలేమితో ఉన్నవారికి కాస్త మగతగా అనిపిస్తుందని పరిశోధకులు గుర్తించారు. మెదడు పనితీరు మందగించడంతోపాటుగా ఏకాగ్రత దెబ్బతింటుందని పరిశోధకులు తెలిపారు. చిన్న విషయానికి కూడా చిరాకు పడుతుంటారని, మానసిక స్థితి స్థిరంగా ఉండదని గుర్తించారు. ఈ దశలో 'కళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. శరీరంలో నాడీవ్యవస్థలో సమతుల్యం దెబ్బతింటుంది. కండరాల నొప్పి మొదలవుతుంది. అప్పుడప్పుడు పని ఒత్తిళ్లతో రాత్రుళ్లు నిద్రపోని వారికి ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.' అని పరిశోధకులు గుర్తించారు.
మూడు రోజులపాటు నిద్రలేకపోతే :మూడురోజులకు మించి నిద్రలేమితో ఉన్నట్లైతే, అలాంటివారిలో మెదడు తీవ్ర ఒత్తిడికి లోనవుతుందని నిపుణులు గుర్తించారు. అలాంటి వారు తీవ్ర భ్రాంతులకు గురవుతారని తెలిపారు. దిగాలుగా ఉండటం, మతి స్థిమితంగా లేకపోవడం, జ్ఞానేంద్రియాలపై నియంత్రణ కోల్పోతున్నట్లుగా అనిపిస్తుంటుని తెలిపారు. చర్మం పాలిపోవడం, చూపు మందగించడంతోపాటు కళ్ల నొప్పులు వస్తాయని, కండరాలు సంకోచించినట్లుగా అనిపిస్తుందని వైద్య నిపుణులు వెల్లడించారు.
వారం రోజులు నిద్ర లేకపోతే : వారానికి మించి నిద్రలేమితో ఉంటే మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు తెలిపారు. నిద్రలేమితో మనిషి ఏదో కోల్పోతున్న భావనలోకి వెళ్లిపోతారని గుర్తించారు. శరీరంలో తేమశాతం తగ్గి, తద్వారా చర్మం పొడిబారిపోతుందని ఆ తర్వాత ముడతలు కూడా మొదలవుతాయంటున్నారు. శరీరంలో పీహెచ్ సమతుల్యం కూడా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.