How to Apply PM Shram Yogi Mandhan Yojana: కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనుగుణంగా ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన కూడా ఒకటి. అసంఘటిత రంగంలోని వారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. మరి ఈ పథకానికి అర్హులు ఎవరు? కావాల్సిన డాక్యుమెంట్లు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది. 2019లో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగ కార్మికులు రూ.3వేల నెలసరి పింఛన్ పొందుతారు. అయితే ఇందుకోసం కొంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.
ఫీచర్స్: ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ యోజన పథకం స్వచ్ఛంద పెన్షన్ పథకం. 50:50 నిష్పత్తిలో చందాదారుడు ఎంత జమచేస్తే అంతే సమానంగా కేంద్ర ప్రభుత్వం జమచేస్తుంది. దీనిపై ఎలాంటి ఆదాయ పన్ను వర్తించదు. ప్రతి చందాదారుడు ఈ పథకం కింద 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3000 పెన్షన్ పొందుతాడు. 60 ఏళ్ల కంటే ముందే మరణిస్తే వారి భార్య లేదా భర్త ఈ పథకాన్ని కొనసాగించవచ్చు.
అర్హులు ఎవరు:
- ఈ పథకంలో చేరే వారి వయసు 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
- నెలవారీ ఆదాయం రూ. 15,000 లోపు ఉండాలి.
- ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ, ఎన్పీఎస్ సభ్యులుగా ఉంటే ఈ పథకంలో చేరడానికి అనర్హులు.
- ఈ పథకంలో చేరాలంటే ఈ శ్రమ్ కార్డు (కార్మిక కార్డు) కచ్చితంగా ఉండాలి.
కావాల్సిన డాక్యుమెంట్లు:
- బ్యాంక్ అకౌంట్
- ఆధార్ కార్డు
- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్
- ఈ శ్రమ్ కార్డు
ఎలా అప్లై చేసుకోవాలి: అర్హత ఉన్న చందాదారులు వారికి సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్స్ (సీఎస్సీ)కు వెళ్లి నమోదు చేసుకోవచ్చు. ఈ సెంటర్ల జాబితా ఎల్ఐసీ ఇండియా వద్ద ఉంటుంది. లేదంటే ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అందుకోసం,
- ఈ పథకానికి అప్లై చేయాలనుకునేవారు ముందుగా ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. https://maandhan.in/
- హోమ్ పేజీలో Login కాలమ్పై క్లిక్ చేస్తే కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో Self Enrollment ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Proceed ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి Proceed పై క్లిక్ చేయాలి.
- డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తే కొన్ని సర్వీసులు కనిపిస్తాయి. అందులో సర్వీస్ కాలమ్లో Enrollment ఆప్షన్పై క్లిక్ చేయాలి. అప్పుడు అక్కడ మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో PM-SYMపై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీకు ఈ శ్రమ్ కార్డ్ ఉందా అని స్క్రీన్ కనిపిస్తుంది. ఉంటే ఎస్ అని క్లిక్ చేయాలి. ఈ శ్రమ్ కార్డ్ లేకుంటే ఈ పథకానికి అప్లై చేసుకునే అవకాశం ఉండదు.
- ఇప్పుడు ఎన్రోల్మెంట్ ఫారమ్ ఫిల్ చేయాలి. ఆ ఫారమ్లో ఈ శ్రమ్ UAN నెంబర్, పేరు, పుట్టినతేదీ, ఫోన్ నెంబర్, జెండర్, ఈమెయిల్ ఐడీ, అడ్రస్ సహా ఇతర వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత బ్యాంక్ ఖాతా, నామినీ వివరాలు టైప్ ఎంటర్ చేయాలి. తర్వాత Mandate ఫారమ్ డౌన్లోడ్ చేసుకుని, దానిని అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీ వయసుకు ఎంత ప్రీమియం చెల్లించాలో అంత పే చేయాలి. ఉదాహరణకు మీరు 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే నెలకు రూ.55 జమచేయాల్సి ఉంటుంది. అంతే మొత్తంగా ప్రభుత్వం కూడా జమచేస్తుంది. ఇక వయసు పెరిగినా కొద్ది కాంట్రిబ్యూషన్ పెరుగుతూ వస్తుంది.
- పేమెంట్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ని ప్రింట్ అవుట్ తీసుకోండి.
విత్డ్రా రూల్స్:
- పథకంలో చేరిన తర్వాత పదేళ్ల కంటే ముందే ఇందులోనుంచి నిష్క్రమిస్తే, చందాదారుడు జమచేసిన దానికి మాత్రమే బ్యాంక్ వడ్డీతో కలిపి వస్తుంది.
- పదేళ్ల తర్వాత, 60 ఏళ్లకు ముందే ఉపసంహరించుకుంటే ఫండ్ ద్వారా సంపాదించిన వడ్డీ లేదా పొదుపు బ్యాంక్ వడ్డీ రేటులో ఏది ఎక్కువైతే దానితో పాటు, లబ్ధిదారుడి వాటా తిరిగి లభిస్తుంది.
పింఛన్దారులకు ఈపీఎఫ్ఓ గుడ్న్యూస్- ఇకపై ఎక్కడినుంచైనా పింఛన్ తీసుకోవచ్చు
కేవలం 10 ఏళ్లు మాత్రమే ఉద్యోగం చేశారా? నెలవారీగా EPF పెన్షన్ ఎంత వస్తుందో తెలుసా?
మీకు ఉద్యోగం లేదా? కానీ పెన్షన్ కావాలా? అయితే ఈ స్కీమ్ మీకోసమే!