Lumpy Skin Disease Vaccine:భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధి (ఎల్ఎస్డీ) టీకా అందుబాటులోకి రాబోతోంది. పాడి పశువులకు ఈ టీకాను అందిస్తారు. బయోలంపివ్యాక్సిన్ అనే పేరుతో రూపొందించిన ఈ టీకా మనదేశంలో మొదటిది కావడం ప్రత్యేకత. ఇప్పటికే దీనికి సీడీఎస్సీఓ (సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) నుంచి లైసెన్సు వచ్చినట్లు బయోవెట్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ టీకా భద్రమైనదే కాకుండా బాగా పనిచేస్తుందని వివరించింది. ఇంకా, దీన్ని ఐసీఏఆర్-ఎన్ఆర్సీఈ, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ)లలో విస్తృతంగా పరీక్షించినట్లు పేర్కొంది. హిస్సార్లోని ఐసీఏఆర్-ఎన్ఆర్సీఈ అందించిన ఎల్ఎస్డీ వైరస్/ రాంచీ/ 2019 వ్యాక్సిన్ స్ట్రెయిన్తో ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు బయోవెట్ సంస్థ తెలిపింది.
ఏటా 50 కోట్ల డోసుల తయారీ
మరోవైపు బయోలంపివ్యాక్సిన్ రూపొందించడంపై భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బయోవెట్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ టీకాకు సీడీఎస్సీఓ లైసెన్సు లభించడం, మనదేశంలో పశుసంపద అభివృద్ధి, ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. ఇకపై ఈ టీకా కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని వెల్లడించారు. బయోలంపివ్యాక్సిన్ను వెంటనే విడుదల చేస్తామని కృష్ణ ఎల్ల వెల్లడించారు. బయోవెట్కు కర్ణాటకలోని మల్లూర్లో ఉన్న యూనిట్లో ఏటా 50 కోట్ల డోసుల టీకాను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని తెలిపారు.
ఈ లింపీ స్కిన్ వ్యాధి వల్ల మనదేశంలో గత రెండేళ్లలో 2 లక్షల పశువులు చనిపోయాయి. ఇంకొన్ని లక్షల పాడి పశువులు పాలు రాకుండా వట్టిపోయాయి. అయితే, ఈ టీకాను పాడి పశువులకు వేయిస్తే, ఎల్ఎస్డీ వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టి, పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందని బయోవెట్ వర్గాలు తెలిపాయి. ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని వివరించాయి.