Health Care Tips for New Moms : గర్భం ధరించినప్పటి నుంచీ బిడ్డ పుట్టే దాకా మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఇదే క్రమంలో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా తల్లీ, బిడ్డా.. ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అయితే, ప్రెగ్నెన్సీ తర్వాత బిడ్డకు పాలు ఇస్తుండడం వల్ల తల్లికి ఆకలేయడం కామన్. ఇదే సమయంలో కొందరికి తీపి పదార్థాలు ఎక్కువగా తినాలనిపిస్తోంది. కానీ, ఇంట్లో పెద్దవాళ్లు తీపి ఎక్కువగా తినొద్దని.. అలా తింటే బిడ్డకు కఫం వస్తుందని అంటుంటారు. నిజంగా బాలింత స్వీట్స్ ఎక్కువగా తింటే పిల్లలకు కఫం వస్తుందా? అందులో నిజమెంత? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బాలింత స్వీట్స్ తింటే పిల్లలకు కఫం వస్తుందన్నది ఒక అపోహ మాత్రమే అంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ శ్రీనాథ్. పూర్వకాలంలో ఇంటి దగ్గరే ప్రసవాలు జరిగేవి. పెద్దవాళ్లే తల్లీ, బిడ్డ సంరక్షణ చూసుకునేవాళ్లు. దాంతో బిడ్డ ఆరోగ్య విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా, అది తల్లి వల్లే జరిగిందని భావించేవాళ్లు. ఈ క్రమంలోనే బాలింత తీపి పదార్థాలు తింటే పిల్లలకు కఫం వస్తుందన్న అపోహ కూడా అప్పటిదే అని సూచిస్తున్నారు. అంతేకానీ, దీనికి సంబంధించి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు అంటున్నారు.
పసిపిల్లలకు తల్లిపాలుఎంతో ఆరోగ్యకరం. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు, రోగనిరోధక శక్తి పెంచడానికి ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి. అందుకే పిల్లలు ఎదిగే క్రమంలో పాలు ఎక్కువగా తాగుతారు. పాలిస్తుండటం వల్ల తల్లికి ఆకలేయడం సర్వసాధారణం. అయితే, చాలా మంది పథ్యం పేరుతో చప్పిడి కూరలు, అన్నం పెడుతుంటారు. దాంతో కావాల్సిన పోషకాలు అందవు. కాబట్టి, బాలింతలు వారి బరువును బట్టి ప్రోటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే డైట్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలంటున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్. అలాగే.. ఏం తిన్నా మితంగా, జీర్ణవ్యవస్థపై ప్రభావం పడకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
వీటికి దూరంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యానికి మేలు!