Tamannah Sikandar Ka Muqadab: హీరోయిన్ తమన్నా ప్రస్తుతం సినిమాల విషయంలో జోరు చూపిస్తూ ముందుకెళ్తోంది. ఓ వైపు లీడ్ రోల్స్ మరోవైపు స్పెషల్ సాంగ్స్ చేసుకుంటూ కెరీర్లో రాణిస్తోంది. తాజాగా ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. సికందర్ కా ముకద్దర్ పేరుతో ఇది రానుంది. చిత్రంలో తమన్నాతో పాటు జిమ్మీ షెర్గిల్, అవినాష్ తివారీ కూడా ప్రధాన పాత్ర పోషించారు. రూ.60 కోట్ల విలువైన వజ్రం చోరీ చుట్టూ తిరిగే కథతో ఇది తెరకెక్కింది.
"60 కోట్ల విలువైన వజ్రం చోరీ. ఓ సుదీర్ఘమైన వెతుకులాట. ఓటమిని అంగీకరించని ఓ ఇన్స్పెక్టర్. సికందర్ కా ముకద్దర్ త్వరలోనే నెట్ఫ్లిక్స్లోకి రానుంది" అనే క్యాప్షన్తో బిహైండ్ ది సీన్స్ పేరుతో మేకింగ్ వీడియోను విడుదల చేసింది నెట్ఫ్లిక్స్. ఇందులో ప్రధాన పాత్రలపై చిత్రీకరించిన సన్నివేశాలను చూపించారు. చివరిలో సినిమా దర్శకుడు నీరజ్ పాండే కనిపించారు. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ను అనౌన్స్ చేయనున్నారు.
ఈ సికందర్ కా ముకద్దర్ మూవీని ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే డైరెక్ట్ చేశారు. నీరజ్ పాండే ఈ మధ్యే చెన్గిజ్తో (Chengiz) పాటు అజయ్ దేవగన్, టబు నటించిన ఔరో మే కహా దమ్ థా చిత్రానికి దర్శకత్వం వహించారు. రీసెంట్గా తమన్నా 'స్త్రీ 2'లో స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.