Sai Durgha Tej Vishwambhara :మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'విశ్వంభర'. ఈ చిత్రాన్ని 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మెగా అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటో కాదు, చిరు మేనల్లుడు సాయిదుర్గా తేజ్ ఈ సినిమాలో ఈ సినిమాలో భాగమైనట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఇందులో ఆయన గెస్ట్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆన్స్క్రీన్లోనూ హీరో (చిరంజీవి) మేనల్లుడి పాత్రలో సాయి కనిపించనున్నారని సమాచారం. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ అన్నట్లే. కాగా, దుర్గా తేజ్ ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో 'బ్రో' (BRO) సినిమాలో ఫుల్ లెంగ్త్లో నటించారు.
అందుకోసం వెయిటింగ్
మేనమామలు పవన్ కల్యాణ్, నాగబాబుతో సాయిదుర్గా తేజ్ ఇప్పటికే యాక్ట్ చేశారు. ఇక మిగిలింది పెదమామ చిరంజీవినే. అయితే ఆయనతోనూ స్క్రీన్ షేర్ చేసుకోవాలనుందని దుర్గాతేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టారు. ఆయనతో నటించే అవకాశం కోసమే ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 'చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా యాక్ట్ చేస్తా. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నా' అని తెలిపారు.