ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా రీరిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ప్రేక్షకులు అంతగా ఆదరించని సినిమాలు కూడా, రిరిలీజ్లో అద్భుతమైన కలెక్షన్లతో అదరగొడుతున్నాయి. తమ అభిమాన హీరో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు సైతం క్యూ కడుతున్నారు. ఈ రీరిలీజ్ల ట్రెండే ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు బూస్ట్ను ఇస్తోంది. అదేలాగంటే?
బాలీవుడ్లో రీరిలీజ్ల మేనియా!
బాలీవుడ్ క్రైమ్ కామెడీ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్' 2012లో విడుదలైంది. ఈ సినిమాను ప్రేక్షకులు అప్పట్లో థియేటర్లో ఆదరించలేదు. అలాగే 2018లో విడుదలైన 'లైలా మజ్ను' కూడా పరాభవం మూటకట్టుకుంది. 'రాక్స్టార్' వంటి సినిమాలు ప్రేక్షకులకు నచ్చలేదు. అయితే ఈ సినిమాలు ఇటీవల రీరిలీజ్ అయ్యి మంచి కలెక్షన్లను సాధించాయి. మొదటి రిలీజైనప్పుడు కలెక్షన్ల లేక డీలా పడ్డ ఈ సినిమాలు ఇప్పుడు ఈ రీరిలీజ్లో అదరగొట్టాయి.
"ఈ సినిమాలను చూడటానికి ఇష్టపడేవారు, విడుదల సమయంలో చూడలేనివారు రిరిలీజ్ సమయంలో థియేటర్లకు వస్తున్నారు. పెద్ద స్క్రీన్ మీద తమ అభిమాన హీరోని చూసుకుంటున్నారు. ఇదే హాల్స్ నిండడానికి, అలాగే ఎగ్జిబిటర్లకు డబ్బులు తెచ్చిపెడుతోంది. సినిమాపై రైట్స్ను కలిగి ఉన్నవారికి కూడా డబ్బు అందుతోంది. 'లైలా మజ్ను', 'రాక్స్టార్' వంటి సినిమాలు రిలీజ్ అప్పుడు థియేటర్లలో అంతగా ఆడలేదు. ప్రస్తుతం రీరిలీజ్ లో అదరగొట్టాయి. లైలా మజ్ను సినిమా రీరిలీజ్లో దేశం మొత్తం మీద 40శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ముంబయిలో అయితే ఏకంగా 80 శాతం ఆక్యుపెన్సీ అయ్యింది." అని ట్రేడ్ అనలిస్ట్ అతుల్ మోహన్ తాజాగా ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
రీరిలీడ్ సినిమాల ట్రెండ్
రీరిలీజ్ చిత్రాలకు సాధారణంగా మంచి స్పందన వస్తోందని, ఈ ట్రెండ్ కొనసాగుతుందని ఆశిస్తున్నామని సినిమా ఓనర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ నితిన్ దాతార్ తెలిపారు. కొత్తగా విడుదలైన సినిమాలు ప్రేక్షకులకు నచ్చకపోవడం వల్ల ఎగ్జిబిటర్లు నష్టాల్లో కూరుకుపోతున్నారని చెప్పారు. అలాంటివారికి రీరిలీజ్ సినిమాలు ఆదుకుంటాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు, రీరిలీజ్ అయిన సినిమాలు ఎప్పుడూ భారీ లాభాలను అర్జించవని మూవీమాక్స్ సినిమాస్ సీఈఓ ఆశిష్ కనకియా తెలిపారు. అయితే అవి ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయని చెప్పుకొచ్చారు. రీరిలీజ్ మూవీస్కు ఆక్యుపెన్సీ దాదాపు 30 శాతం ఉంటుందని వెల్లడించారు.