Niharika Committee Kurrollu :చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీసు వద్ద ఘన విజయం సొంతం చేసుకున్న తాజా చిత్రం 'కమిటీ కుర్రోళ్లు'పై తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దిగ్గజ డైరెక్టర్లు రాజమౌళి, నాగ్ అశ్విన్, సుకుమార్, క్రిష్ లతోపాటు స్టార్ హీరోలు మహేశ్ బాబు, రామ్ చరణ్, నాని, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీప్రసాద్లు ప్రత్యేకంగా అభినందించారు. అందరు కొత్త వాళ్లతో తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్న నిర్మాత నిహారిక కొణిదెల, డైరెక్టర్ యదువంశీలను అభినందిస్తూ సామాజిక మాద్యమాల్లో ఆనందాన్ని వ్యక్తం చేశారు. నేటితరం కుర్రాళ్లు సాధించిన పెద్ద విజయమంటూ రాజమౌళి కితాబు ఇవ్వగా, 'కమిటీ కుర్రోళ్లు' విజయం సాధించారనే మాట వినడం తనకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని సుకుమార్ తెలిపారు. ప్రతిభావంతులైన యువతీ యవకులు కమిటీ కుర్రోళ్లతో తామేంటో నిరూపించుకున్నారని నాగ్ అశ్విన్ అభినందించారు. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఇటు చిత్ర ప్రముఖుల నుంచి అటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.
ఇదిలా ఉండగా, నిహారిక అన్నయ్య హీరో రామ్ చరణ్ కూడా ఈ సినిమా టీమ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ విజయాన్నికి తన సోదరి నిహారికతో పాటు టీమ్ మొత్తం అర్హులని ఆయన పేర్కొన్నారు.
"నిహారిక ఇంతటి సక్సెస్ను సాధించినందుకు కంగ్రాజ్యులేషన్స్. ఈ విజయానికి నువ్వు అర్హురాలివి. నీ టీమ్తో కలిసి నువ్వు పడిన కష్టం, నీ హార్డ్ వర్క్, అంకిత భావం నిజంగా స్ఫూర్తిదాయకం. 'కమిటీ కుర్రోళ్లు'లో భాగమైన అందరికీ అభినందనలు. ముఖ్యంగా ఈ కథకు జీవం పోసిన డైరెక్టర్ యదువంశీకి ప్రత్యేక అభినందనలు" అని రామ్చరణ్ పేర్కొన్నారు.