Highest Paid Lyricist :సినిమా పాటకు సంగీతం, సాహిత్యం రెండు కళ్లు లాంటివి. సంగీతం పాటను మనసుకు హత్తుకునేలా చేస్తే, సాహిత్యం మదిలో నిలిచిపోయేలా చేస్తుంది. భారతదేశంలో అద్భుతమైన పాటలు అందించిన గీత రచయితలు చాలా మందే ఉన్నారు. కానీ వీరిలో అత్యధిక పారితోషికం అందుకుంటున్నది ఎవరో తెలుసా?
డుంకీ సినిమాకి భారీ పారితోషికం
ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న గీత రచయిత జావేద్ అక్తర్. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఓ ప్రముఖ మీడియా వెబ్సైట్ నివేదిక ప్రకారం, జావేద్ అక్తర్ డుంకీ సినిమాకు గానూ ఓ పాట రాయడానికి ఏకంగా రూ.25 లక్షల పారితోషకాన్ని అందుకున్నారు. జావేద్ అక్తర్ కేవలం గీత రచయిత మాత్రమే కాదు, స్క్రీన్ రైటర్, కవిగానూ పాపులర్ అయ్యారు.
'ఒక్క పాట రాయడానికి ఇష్టపడను'
వాస్తవానికి జావేద్ అక్తర్ సినిమాలో కేవలం ఒక పాట రాయడం చాలా అరుదు. ఎందుకంటే ఆయన మూవీలోని అన్ని పాటలు రాయడానికి ఇష్టపడతారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఈవెంట్లో వెల్లడించారు. 'నేను సాధారణంగా సినిమాలో ఒక్క పాట మాత్రమే రాయను. రాజ్కుమార్ హిరాణీ 'డంకీ' సినిమా కోసం నన్ను ఒక్క పాటకు సాహిత్యం రాయమని అడిగారు. నేను మొదట నిరాకరించాను. కానీ ఆయన పట్టుబట్టి రాయమని కోరారు. నేను ఆయన అడగటం మానేస్తారనే ఉద్దేశంతో, చాలా కండీషన్స్ పెట్టాను. కానీ ఆయన అన్నింటికీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, ఓకే చెప్పారు అని జావెద్ అన్నారు.