తెలంగాణ

telangana

ETV Bharat / business

గుడ్ న్యూస్‌ - ఈ ఏడాది 10,000 పోస్టుల భర్తీకి SBI ప్లాన్‌! - SBI Plans To Increase Employees

SBI Plans To Increase Employees : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 10,000 మంది ఉద్యోగులను రిక్రూట్ చేయాలని భావిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

SBI Chairman Challa Srinivasulu Setty
SBI Chairman Challa Srinivasulu Setty (ETV Bharat)

SBI Plans To Increase Employees :దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 10,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది. సాధారణ బ్యాంకింగ్‌ అవసరాలతోపాటు, బ్యాంక్ సాంకేతికతను అప్‌గ్రేడ్ చేయడమే లక్ష్యంగా ఈ రిక్రూట్‌మెంట్ చేయాలని నిర్ణయించుకుంది. తమ కస్టమర్లకు ఎలాంటి అంతరాయం లేకుండా సేవలు అందించడం కోసం, అలాగే తమ డిజిటల్‌ ఛానల్‌లను మరింత బలోపేతం చేయడం కోసం ఎస్‌బీఐ ఇప్పటికే టెక్నాలజీపై చాలా ఇన్వెస్ట్ చేసింది.

"మేము జనరల్ బ్యాంకింగ్, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ల కోసం మా ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తున్నాం. మేము ఇటీవలే 1500 ఎంట్రీ లెవల్‌, హయ్యర్‌ లెవెల్‌ సాంకేతిక నిపుణుల రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించాం. మా టెక్నాలజీ రిక్రూట్‌మెంట్ ద్వారా డేటా సైంటిస్టులు, డేటా ఆర్కెటెక్ట్‌లు, నెట్‌వర్క్ ఆపరేటర్లు మొదలైన సాంకేతిక నిపుణులను నియమించుకుంటాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మా అవసరాల దృష్ట్యా 8000 నుంచి 10,000 మంది ఉద్యోగులను నియమించుకుంటాం. వీరిలో సాధారణ బ్యాంకింగ్ సేవలు అందించేవారితోపాటు, సాంకేతిక నిపుణులు కూడా ఉంటారు." - చల్లా శ్రీనివాసులు శెట్టి, ఎస్‌బీఐ ఛైర్మన్‌

ఎస్‌బీఐ స్టాఫ్
2024 మార్చి నాటికి ఎస్‌బీఐలో 2,32,296 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 1,10,116 మంది ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్లో ఉన్నారు.

అప్‌స్కిల్లింగ్‌
'కాలం గడుస్తున్న కొలదీ కస్టమర్ల అవసరాలు పెరుగుతున్నాయి. అలాగే సాంకేతికత కూడా అభివృద్ధి చెందుతోంది. విస్తృతస్థాయిలో డిజిటలైజేషన్‌ జరుగుతోంది. అందుకే ఎస్‌బీఐ ఉద్యోగులకు కాలానుగుణంగా రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ చేస్తున్నాం' అని ఎస్‌బీఐ ఛైర్మన్‌ సీఎస్‌ శెట్టి తెలిపారు.

నెట్‌వర్క్ విస్తరణ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 22,542 బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటికి తోడు బ్యాంక్ నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 600 కొత్త శాఖలను ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు ఎస్‌బీఐ ఛైర్మన్ తెలిపారు.

'మేము ఎస్‌బీఐ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించాలని ప్రణాళిక వేసుకున్నాం. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నాం. ప్రస్తుతానికి చాలా రెసిడెన్షియల్ ప్రాంతాల్లో మా బ్రాంచ్‌లు లేవు. అందుకే ఆ ఏరియాల్లో మా శాఖలను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాం' అని చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.

"ఎస్‌బీఐకు దేశవ్యాప్తంగా 65,000 ఏటీఎంలు ఉన్నాయి. అలాగే 85,000 బిజినెస్ కరస్పాండెట్లు ఉన్నారు. ఈ నెట్‌వర్క్ ద్వారా సుమారు 50 కోట్ల మంది వినియోగదారులకు ఎస్‌బీఐ సేవలు అందిస్తోంది. మేము ప్రతి భారతీయునికి, అలాగే ప్రతి భారతీయ కుటుంబానికి బ్యాంకర్‌గా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఎస్‌బీఐని అత్యుత్తమ బ్యాంక్‌గా మార్చడమే మా లక్ష్యం" అని ఎస్‌బీఐ ఛైర్మన్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details