తెలంగాణ

telangana

భారీగా ఉద్యోగాలు- ఐటీ శ్లాబుల్లో మార్పులు- బడ్జెట్​లో చెప్పిన గుడ్​న్యూస్​ లిస్ట్ ఇదే! - Budget 2024 Key Highlights

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 3:24 PM IST

Budget 2024 Key Highlights : కేంద్ర బడ్జెట్​ 2024లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు వర్గాల వారిని ఆకట్టుకునేందుకు అనేక తాయిలాలు ప్రకటించారు. ముఖ్యంగా పన్ను శ్లాబుల్లో మార్పులు చేశారు. యువతకు శిక్షణ, ఉపాధి కల్పన చేసేందుకు పలు పథకాలు తీసుకువచ్చారు. వ్యాపారులకు ఊరట కల్పించేందుకు రుణాలు, సుంకాలు తగ్గించారు.

Budget 2024 Key Highlights
Budget 2024 (ETV Bharat)

Budget 2024 Key Highlights :కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ కేంద్ర బడ్జెట్​ -2024లో పలు వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా తాయిలాలు ప్రకటించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. వేతన జీవికి ఊరట :బడ్జెట్‌లో వేతన జీవికి స్వల్ప ఊరటనిస్తూ కొత్త పన్ను విధానంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక మార్పులు చేశారు. పన్ను శ్లాబుల్లో మార్పుతో పాటు, స్టాండర్డ్‌ డిక్షన్‌ విషయంలో ఊరటనిచ్చారు. ప్రస్తుతం స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50 వేలుగా ఉండగా.. ఆ మొత్తాన్ని రూ.75 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. పెన్షనర్లకు రూ.15వేలుగా ఉన్న స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.25వేలకు పెంచారు. క్యాపిటల్‌ గెయిన్స్‌ విధానం సరళీకరణ చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. స్టార్టప్‌లకు ప్రోత్సహించేందుకు ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

కొత్త పన్ను శ్లాబులు!

  • సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా
  • రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను
  • రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను
  • రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను
  • రూ.12- 15 లక్షల 20 శాతం పన్ను
  • రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను

2. ఉపాధి కల్పన : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్​లో ఉపాధి కల్పనపై ప్రధానంగా దృష్టి సారించారు. అందుకే మూడు కొత్త పథకాలు ప్రకటించారు. అవి:

  • తొలిసారి ఉద్యోగంలో చేరేవారికి ఒక నెల వేతనం అందిస్తారు. సంఘటిత రంగంలోని అన్ని రంగాలకు దీన్ని వర్తింపజేస్తారు. ఈ పథకం కింద గరిష్ఠంగా రూ.15వేలు వరకు అందిస్తారు.
  • తయారీ రంగంలో అదనపు ఉపాధి కల్పనే లక్ష్యంగా రెండో పథకాన్ని తీసుకువచ్చారు. దీని ద్వారా దాదాపు 30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు. గరిష్ఠంగా రూ.1 లక్ష వేతనం ఉన్నవారికి దీనిని వర్తింపజేస్తారు.
  • అదనంగా ఉద్యోగాలు కల్పించిన యాజమాన్యాలకు రెండేళ్లపాటు రూ.3,000 వరకు ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్​ను రీయంబర్స్ చేస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ పథకం వల్ల దాదాపు 50 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా.

3. మహిళా ఉద్యోగులకు హాస్టల్స్​
పరిశ్రమల సహకారంతో మహిళా ఉద్యోగులకు ప్రత్యేక హాస్టళ్లు, శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే పరిశ్రమల భాగస్వామ్యంతో మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.

4. లక్షల మందికి నైపుణ్య శిక్షణ
రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల సహకారంతో నైపుణ్య శిక్షణ కోసం ప్రధానమంత్రి ప్యాకేజీ కింద నాలుగో పథకాన్ని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఐదేళ్ల వ్యవధిలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణనిస్తామన్నారు. 1,000 ఐటీఐలను హబ్‌ అండ్ స్పోక్‌ మోడల్‌ కింద ఉన్నతీకరిస్తామని వెల్లడించారు.

5. స్కిల్‌ లోన్స్‌
మోడల్‌ స్కిల్‌ లోన్‌ కింద రూ.7.5 లక్షల వరకు రుణాలకు ప్రభుత్వ ప్రయోజిత ఫండ్‌ ద్వారా పూచీకత్తు ఇస్తామని కేంద్రం తెలిపింది. దీని వల్ల ఏటా 25,000 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని ఆశాభావం వ్యక్తం చేసింది.

6. విద్యా రుణాలు
దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలను (రూ.10 లక్షల వరకు) తీసుకునే విద్యార్థులకు కేంద్రం ఆర్థిక సాయం అందజేయనుంది. దీని కింద ఏటా లక్ష మంది విద్యార్థులకు రుణ మొత్తంపై 3 శాతం వడ్డీ రాయితీ ఇచ్చే ఈ-ఓచర్లు అందజేస్తుంది.

7. కస్టమ్స్ సుంకం తగ్గింపు
కేంద్ర బడ్జెట్‌లో బంగారం, వెండి, ప్లాటినమ్ లాంటి లోహాలతో సహా, క్యాన్సర్‌ ఔషధాలు, మొబైల్ ఫోన్లపై కస్టమ్స్‌ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీంతో రిటైల్‌ మార్కెట్‌లో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. అయితే టెలికాం పరికరాల ధరలు మాత్రం పెరగనున్నాయి.

8. ఇళ్ల నిర్మాణం
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం చేస్తారు. అర్బన్‌ హౌసింగ్‌ కోసం ఐదేళ్లలో రూ.2.2 లక్షల కోట్లు కేటాయిస్తారు.

9. కార్మికుల కోసం
పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

10. ముద్ర రుణాలు
చిరువ్యాపారులకు మేలు చేకూర్చేవిధంగా ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు.

11. గ్రామీణ అభివృద్ధి
బడ్జెట్‌లో గ్రామీణ అభివృద్ధి కోసం రూ.2.66 లక్షల కోట్లు కేటాయించారు.

12. వ్యవసాయం కోసం
ప్రకృతి వ్యవసాయంలోకి దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను తీసుకొచ్చే ప్రణాళిక వేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. 5 రాష్ట్రాల్లో కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందిస్తున్నామని స్పష్టం చేశారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి రూ.1.5 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

13. వారాంతపు సంతలు
పీఎం స్వనిధి కింద వంద నగరాల్లో ప్రత్యేక వారాంతపు సంతలు ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

14. పెట్టుబడుల విధానంలో సరళీకరణ

  • ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
  • ఇతర దేశాల్లో భారత్‌ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
  • వాణిజ్య అనుకూల విధానాలకు జన్‌ విశ్వాస్‌ బిల్లుతో మరిన్ని సంస్కరణలు


గుడ్ న్యూస్​ - ముద్ర లోన్ లిమిట్ రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు! - MUDRA Loan Scheme Doubled

అర్బన్ హౌసింగ్​కు రూ.2.2లక్షల కోట్ల ప్యాకేజీ- మహిళలు కొనే ఆస్తులపై పన్ను తగ్గింపు - Union Budget 2024

ABOUT THE AUTHOR

...view details