UP Train Accident Today :ఉత్తర్ప్రదేశ్లోని గోండా జిల్లాలో చండీగఢ్- డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ముగ్గురు మరణించారు. 33 మంది గాయపడ్డారు. గురువారం మధ్యాహ్నం 2.35 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన రైలు ఉదయం 11.30 గంటలకు చండీగఢ్ స్టేషన్ నుంచి అసోంలోని డిబ్రూగఢ్కు బయల్దేరింది. గురువారం మధ్యాహ్నం యూపీలోని ఝులాహి రైల్వే స్టేషన్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో రైలులోని నాలుగు ఏసీ బోగీలు సహా 12 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే రైలు పట్టాలు తప్పిన వెంటనే ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వారంతా కేకలు వేయడం ప్రారంభించారు. రైలు ఆగిన వెంటనే దిగి పరుగులు తీశారు.
హెల్ప్లైన్ నంబర్స్ ఏర్పాటు
డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనపై రైల్వేశాఖ దర్యాప్తు ప్రారంభించింది. హెల్ప్లైన్ నంబర్స్ను కూడా ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించిన వివరాలను ఎక్స్లో పోస్ట్ చేసింది. కొన్ని రైళ్లను దారి మళ్లిస్తామని తెలిపింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తీవ్రందగా గాయపడ్డ వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50000 అనౌన్స్ చేసింది. CRS విచారణతో పాటు, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.