Scrap Dealer Win Lottery In Punjab :పంజాబ్కు చెందిన ఓ స్క్రాప్ డీలర్ను అదృష్టం వరించింది. రూ.500తో కొన్న లాటరీ టికెట్ కోటీశ్వరుడిని చేసింది. రాఖీ సందర్భంగా కొన్న లాటరీ టికెట్ ద్వారా ఏకంగా రూ. 2.5 కోట్లు గెలుచుకున్నారు.
జలంధర్ జిల్లాలోని ఆదమ్పుర్కు చెందిన ప్రీతమ్ లాల్ జగ్గీ(67) స్క్రాప్ డీలర్గా పని చేసుకుంటూ జీవిస్తున్నారు. గత 50 ఏళ్లుగా ఆయనకు లాటరీ టికెట్ కొనే అలవాటు ఉంది. రాఖీ సందర్భంగా రూ.500తో ఓ లాటరీ టికెట్ను తన భార్య అనీతా జగ్గీ పేరు మీద కొన్నారు. ఈసారి ఆయన్ను అదృష్టం వరించి రూ.2.5 కోట్లు గెలుచుకున్నారు. అయితే ముందుగా తన నంబర్ లాటరీ 452749 నంబర్ను న్యూస్ పేపర్లో చూసి నమ్మలేదని, లాటరీ ఏజెంట్ ఫోన్ చేస్తే నమ్మకం కలిగిందని జగ్గీ చెబుతున్నారు.
'నేను గత 50 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నా. కొన్ని సార్లు చిన్న బహుమతులు వచ్చేవి. రాఖీ రోజున లాటరీ టికెట్ కొంటాను అంటే నా భార్య ఇదే చివరిసారి అని చెప్పింది. నేను సేవక్ అనే వ్యక్తి దగ్గర నుంచి లాటరీ టికెట్ను నా భార్య పేరు తీసుకున్నా. అయితే ఆదివారం నా లాటరీ నంబర్ను న్యూస్ పేపర్లో చూశా కానీ నమ్మలేదు. ఏజెంట్ ఫోన్ చేశాకే నమ్మకం వచ్చింది. ఆ వార్త విని షాక్ అయ్యాను. ఒకప్పుడు నేను ఒక రూపాయికి లాటరీ కొన్నా. చివరికి రూ. 500 లాటరీ నన్ను కోటీశ్వరుడిని చేసింది. ప్రస్తుతం నాకు సొంత ఇల్లు కూడా లేదు. వచ్చిన డబ్బుతో ఇల్లు, షాప్ ఏర్పాటు చేసుకుంటా' అని ప్రీతమ్ లాల్ జగ్గీ అన్నారు.