Supreme Court On Freebies :ఉచితాల పేరుతో ఎన్నికల హామీలు ఇవ్వడంపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉచితాలు ఇవ్వడం ద్వారా ప్రజలను పరాన్నజీవులుగా మారుస్తున్నారని ఆక్షేపించింది. పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై విచారణలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
'వారిని అభివృద్ధిలో భాగం చేయండి'
ఎన్నికలకు ముందు ఉచిత హామీలను ప్రకటించడాన్ని అత్యున్నత ధర్మాసనం తప్పుపట్టింది. ఉచిత రేషన్, ఉచితంగా నగదు ఇస్తున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉచితాలతో ఏ పనీ చేయకుండానే భోజనం, డబ్బు సంపాదిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పేదల పట్ల శ్రద్ధ చూపడాన్ని సమర్థిస్తున్నప్పటికీ ఈ పథకాల ద్వారా లబ్ధిదారులను సమాజంలో ప్రధాన స్రవంతిలో కలపకుండా పరాన్నజీవులుగా మారుస్తున్నామని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి వారికి పని కల్పించినపుడే దేశాభివృద్ధికి దోహదపడతారని వ్యాఖ్యానించింది.