Prashant Kishor On BJP Win : లోక్సభ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు వస్తాయని ఆయన అంచనా వేశారు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అగ్రనేతలు చెబుతున్న విధంగా 370 సీట్లు రావని జోస్యం చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో బీజేపీ ఓట్ల వాటాతో పాటు సీట్ల సంఖ్యను కూడా పెంచుకుంటుందని ప్రశాంత్ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ''బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అజేయులు కాదు. వారిని ఓడించేందుకు మూడు వాస్తవిక అవకాశాలు ఉన్నాయి. అయితే సోమరితనం, తప్పుడు వ్యూహాల కారణంగా బీజేపీని ఓడించే అవకాశాన్ని ప్రతిపక్షాలు కోల్పోతున్నాయి'' అని పీకే విశ్లేషించారు.
'కనీసం 100 సీట్లు గెలవకుండా చేయాలి'
''ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో కనీసం 100 సీట్లలో బీజేపీ ఓడిపోయేలా చేయగలిగితేనే ఇండియా కూటమికి విజయావకాశాలు పెరుగుతాయి. లేదంటే బీజేపీని ఓడించడం అసాధ్యం. కాంగ్రెస్, సమాజ్వాదీ, ఆర్జేడీ, ఎన్సీపీ, తృణమూల్ వంటి పార్టీలు తమకు పట్టున్న స్థానాల్లోనే బీజేపీని ఓడించలేకపోతున్నారు. ఇండియా కూటమికి ఒక అజెండ, ఒక వాదంతో పాటు ఉమ్మడి ఆమోదం పొందిన ఒక వ్యక్తి లేరు. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్లలో ఎక్కవ సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. కానీ, మీరేమో మణిపుర్, మేఘాలయాల్లో పర్యటిస్తున్నారు. మరెలా ఇండియా కూటమికి విజయం వరిస్తుంది. అలాగే యూపీ, బిహార్, మధ్యప్రదేశ్లలో విపక్షాలు గెలవకపోతే వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ గెలిచినా ప్రయోజనం ఉండదు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అనుకున్న ఫలితాల రానప్పుడు తన తల్లి సోనియా గాంధీలాగే రాహుల్ కూడా తప్పుకోవాలి. వ్యూహాత్మకంగా ఉత్తరప్రదేశ్లోని అమేఠీ లోక్సభ సీటును రాహుల్ వీడడం వల్ల జనంలోకి తప్పుడు సందేశాన్ని పంపినట్లు అయ్యింది '' అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
'కచ్చితంగా మొదటి స్థానంలో బీజేపీ'
ఇక తెలంగాణలో బీజేపీ మొదటి రెండు స్థానాల్లోకి వస్తుందని ఇది చాలా పెద్ద విషయమని ప్రశాంత్ అన్నారు. 'ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి గెలవడం చాలా కష్టం. ఒడిశాలో బీజేపీ కచ్చితంగా నంబర్ వన్ అవుతుంది. ఫలితాలను చూశాక మీరే ఆశ్చర్యపోతారు. బంగాల్లో నంబర్ వన్ పార్టీగా బీజేపీ అవతరిస్తుంది. తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతం రెండంకెలకు చేరుకుంటుంది' అని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.