తెలంగాణ

telangana

'పోలీసులు లంచం ఇవ్వాలనుకున్నారు!' కోల్​కతా డాక్టర్ ఫ్యామిలీ సంచలన ఆరోపణలు - Kolkata Doctor Case

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2024, 11:30 AM IST

Kolkata Doctor Case : కోల్​కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో మరో ట్విస్ట్! తమ కుమార్తె హత్యాచారం కేసును అణిచివేసేందుకు పోలీసులు చూశారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపణలు చేశారు.

Kolkata Doctor Case
Kolkata Doctor Case (Associated Press)

Kolkata Doctor Case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, హడావుడిగా తమ కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారని తెలిపారు. తమకు లంచం కూడా ఇవ్వజూపారని ఆరోపించారు.

వైద్యురాలిపై హత్యాచార ఘటనకు బుధవారం రాత్రి కోల్‌కతాలో జరిగిన ఆందోళనల్లో బాధితురాలి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆ సమయంలో పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. "పోలీసులు మొదటి నుంచి మా కుమార్తె హత్యాచార కేసును మూసివేయడానికి ప్రయత్నిస్తున్నారు. తొలుత మా కుమార్తె మృతదేహాన్ని చూసేందుకు అనుమతించలేదు. పోస్టుమార్టం పరీక్షలు పూర్తయ్యేంతవరకు పోలీస్‌ స్టేషన్​లోనే వేచి ఉండేలా చేశారు. మా కుమార్తె మృతదేహాన్ని మాకు అప్పగించినప్పుడు సీనియర్ పోలీసు అధికారి ఒకరు లంచం ఇవ్వజూపారు. మేము అందుకు తిరస్కరించాం. మా కుమార్తెకు న్యాయం చేయాలని పోరాడుతున్న జూనియర్‌ వైద్యులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నాం" అని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు.

ఈ కేసుపై తొలుత కోల్‌కతా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, దర్యాప్తు సమయంలో వారు వ్యవహరించిన తీరుపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కేసును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం దీనిపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడు సంజయ్‌రాయ్‌ సహా ఘటన జరిగిన ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌, మరికొందరికి పాలీగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించారు.

కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ప్రజలు (Associated Press)

కొవ్వొత్తుల ర్యాలీ
మరోవైపు, వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న యువ వైద్యులకు కోల్‌కతా నగరం అండగా నిలిచింది. వాళ్లకు మద్దతుగా లైట్స్‌ ఆఫ్‌ మార్చ్‌ నిర్వహించింది. దీంతో దాదాపు నగరమంతా చీకటిమయంగా మారింది. బుధవరాం రాత్రి 9 గంటల ప్రాంతంలో కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌ లాంటి ప్రముఖ కట్టడాల లైట్లను కొంతసేపు ఆర్పివేశారు. సాధారణ పౌరులు కూడా ఇళ్లల్లో లైట్లను ఆఫ్ చేసి కాగడాలు, క్యాండిళ్లు పట్టుకొని వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. వీరికి మద్దతుగా రాజ్‌భవన్‌ కార్యాలయం కూడా అంధకారంగా మారింది. వెలుతురు భయాన్ని కలిగించినప్పుడు చీకటే అండగా నిలుస్తుందని గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ అన్నారు.

కొవ్వొత్తుల ర్యాలీ (Associated Press)
కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న చిన్నారి (Associated Press)

కోల్​కతా CP రాజీనామా చేయాలని డాక్టర్ల డిమాండ్- రాత్రంగా రోడ్డుపైనే నిరసన! - Kolkata Doctor Case

బంగాల్​లో ఆగని నిరసన జ్వాలలు- పోటాపోటీగా దీదీ పార్టీ ఆందోళన కార్యక్రమాలు!

ABOUT THE AUTHOR

...view details