తెలంగాణ

telangana

పంద్రాగస్టు వేడుకలకు అంతా రెడీ- 11వ సారి జెండా ఎగరేయనున్న మోదీ- 6వేల మందికి ఆహ్వానం - Independence Day 2024

By ETV Bharat Telugu Team

Published : Aug 14, 2024, 5:16 PM IST

Independence Day 2024 Modi : దిల్లీలో జరిగే 78వ స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. 2047 వికసిత భారత్‌ థీమ్‌తో జరగనున్న ఈ వేడుకల్లో దాదాపు 6 వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. రైతులు, యువత, గిరిజన సంఘాలు, మహిళలతో సహా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.

MODI
MODI (Getty Images)

Independence Day 2024 Modi :78వ స్వాతంత్ర్య వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దిల్లీలోని ఎర్రకోటలో గురువారం జరిగే ఈ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి వేడుకలు జరగనున్నాయి. మోదీ 11వ సారి త్రివర్ణ పతకాన్ని ఎగురవేయనున్నారు. ఈ ఏడాది వేడుకలకు దాదాపు ఆరు వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించినట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. వీరిలో రైతులు, యువత, మహిళలు, గిరిజన సంఘాల నాయకులు సహా అనేక మందికి ఆహ్వానం పంపారు.

ఆ లక్ష్యంతో 6 వేల మందికి ఆహ్వానం
జాతీయ ఉత్సవాల్లో ప్రజా భాగస్వామాన్ని పెంచాలనే లక్ష్యంతో 6 వేల మందికి ఆహ్వానం పంపినట్లు కేంద్రం తెలిపింది. 2047 వికసిత్‌ థీమ్‌తో ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలు జరగనున్నాయి. భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ వేడుకలు పునరుత్తేజాన్ని అందిస్తాయని తెలిపింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మొత్తం 117 మంది అథ్లెట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను 11 బృందాలుగా విభజించారు.

సంప్రదాయ దుస్తుల్లో 2 వేల మంది!
ఈ వేడుకల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 2 వేల మంది సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేయనున్నారు. ఉదయం ఎర్రకోట వద్దకు చేరుకోనున్న ప్రధానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని అధికారిక బృందం స్వాగతం పలకనుంది. అనంతరం రక్షణ దళాలు ఇచ్చే గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించనున్నారు. ఆ తర్వాత త్రివర్ణ పతకాన్ని ఎగురవేయనున్నారు. రెండు అధునాతన తేలికపాటి ధ్రువ్‌ హెలికాప్టర్లు పూల వర్షాన్ని కురిపించనున్నాయి. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

తొలి కాంగ్రెస్సేతర ప్రధాని మోదీనే!
వరుసగా పదేళ్లు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా ఇప్పటికే నరేంద్ర మోదీ నిలిచారు. గత ఏడాది 90 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడిన ఆయన, పంద్రాగస్టు ప్రసంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు 10 సార్లు మోదీ ప్రసంగించగా సగటు సమయం 82 నిమిషాలుగా ఉంది. దేశ చరిత్రలో ఇతర ప్రధానులు మాట్లాడిన సగటు ప్రసంగ సమయం కంటే ఇది ఎక్కువ కావడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details