PM Modi Commissions3 Warships : ప్రధాన నౌకాదళ శక్తిగా భారత్ అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచదేశాలు భారత్ను విశ్వసనీయ, బాధ్యతాయుత భాగస్వామిగా చూస్తున్నాయన్నారు. 77వ సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం ముంబయిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అంతకంటే ముందు రెండు యుద్ధనౌకలను ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.
"ఈ మూడు కూడా మేడిన్ ఇండియానే. వీటిలో ఒకటి డెస్ట్రాయర్, మరొకటి ఫ్రిగేట్, ఇంకోటి సబ్ మెరైన్. ఇవన్నీ కలిపి ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారి. ఇప్పుడు నౌకాదళ శక్తిపరంగా భారత్ మరింత బలోపేతమైంది. భారత్ సైనిక శక్తిని పెంచుకుంటున్నది వికాసం కోసమే. విస్తరణవాదం కోసం కాదు. సురక్షితమైన, వికాసశీలమైన ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని భారత్ సదా కోరుకుంటుంది. ప్రపంచ భద్రత, ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కీలక పాత్ర పోషించనుంది. భారత నౌకాదళం ప్రపంచ దేశాలతో కలిసి సముద్ర జలాల మీదుగా ఆయుధాలు, డ్రగ్స్ రవాణా జరగకుండా, టెర్రరిజానికి ఊతం లభించకుండా అడ్డుకుంటోంది. నౌకాదళం అహర్నిశలు చేస్తున్న సేవల వల్లే భారత్ సురక్షిత స్థానంగా మారింది"
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
గత పదేళ్లలో దేశ సైన్యానికి 33 యుద్ధ నౌకలు, 7 జలాంతర్గాములను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. 'రక్షణ రంగంలో భారత్ ఆత్మ నిర్భరతను సాధిస్తోంది. దేశంలో జరిగిన రక్షణరంగ ఉత్పత్తుల విలువ రూ.1.25 లక్షల కోట్లు దాటింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ అడుగులు వేస్తోంది' అని మోదీ తెలిపారు.