తెలంగాణ

telangana

'ఆస్పత్రి బోర్డుపై శిక్షల వివరాలు, కఠిన విజిటర్ పాలసీ అమలు'- వైద్యుల భద్రతపై కేంద్రం సూచనలు - Doctors Safety Rules Regulations

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2024, 10:31 PM IST

Doctors Safety Rules And Regulations : వైద్యుల భద్రతకు సంబంధించిన కేంద్రం, రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. వైద్యారోగ్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే బాధ్యులకు విధించే శిక్షలకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి ప్రాంగణంలో స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొంది. జిల్లా ఆస్పత్రుల్లో సైక్యూరిటీ ఆడిట్ నిర్వహించి, రాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహించాలని నిర్దేశించింది. పెద్ద ఆస్పత్రుల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి అందులోని సిబ్బంది నిరంతరం సీసీటీవీలను పర్యవేక్షించాలని సూచించింది.

Doctors Safety Rules And Regulations
Doctors Safety Rules And Regulations (Getty Images)

Doctors Safety Rules And Regulations :పనిప్రదేశంలో వైద్యుల భద్రతకు సంబంధించిన ప్రోటోకాల్‌ను నేషనల్‌ టాస్క్‌ఫోర్స్ రూపొందించే లోగా ఈ అంశంపై కేంద్రం, రాష్ట్రాలకు పలు సూచనలు చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వైద్యారోగ్య సిబ్బంది భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు లేఖ రాశారు. వైద్యారోగ్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే బాధ్యులకు విధించే శిక్షలకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి ప్రాంగణంలో స్పష్టంగా ప్రదర్శించాలని కేంద్రం పేర్కొంది.

రాత్రి వేళల్లో క్యాంపస్‌లోని!
ఆస్పత్రుల్లోని కీలక ప్రదేశాల్లో సాధారణ ప్రజలు, రోగుల బంధువుల కదలికలపై నియంత్రణ ఉంచి విజిటర్‌ పాస్‌ పాలసీని కఠినంగా అమలు చేయాలని సూచించింది. ఆస్పత్రుల్లో హింసాత్మక ఘటనల నియంత్రణ వైద్యుల భద్రత కోసం అమలు చేయాల్సిన వ్యూహాల కోసం సీనియర్‌ వైద్యులు, పాలనాధికారులతో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. రాత్రి వేళల్లో క్యాంపస్‌లోని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి రెసిడెంట్‌ డాక్టర్లు, నర్సులు సురక్షితంగా వెళ్లేలా సదుపాయాలు కల్పించాలని కేంద్రం నిర్దేశించింది.

ప్రతి మూలా సీసీటీవీ కెమెరాలు!
లైంగిక వేధింపులపై విచారణ కోసం అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. క్యాంపస్‌లోని ప్రతి మూలా సీసీటీవీ కెమెరాలు పనిచేసేలా చూస్తూ వాటిని నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొంది. అందులోని డేటాను భద్రపరచాలని తెలిపింది. జిల్లా ఆస్పత్రుల్లో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించి రాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహించాలని నిర్దేశించింది. పెద్ద ఆస్పత్రుల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి అందులోని సిబ్బంది నిరంతరం సీసీటీవీలను పర్యవేక్షించాలని సూచించింది.

ఆస్పత్రిని స్థానిక పోలీసు స్టేషన్‌కు అనుసంధానం చేయాలంది. బోధనాసుపత్రుల్లో నిరంతరం కలెక్టర్లు, ఎస్పీలు, ఆస్పత్రి యంత్రాంగం సంయుక్తంగా సెక్యూరిటీ ఆడిట్‌లను నిర్వహించాలని సూచించింది. మౌలిక వసతుల కొరత, భద్రతపరమైన లోపాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. భద్రత కోసం నియమించుకున్న వారితో పాటు మిగతా సిబ్బందిని పర్యవేక్షించాలని పేర్కొంది. కాంట్రాక్టు భద్రతా సిబ్బందికి తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు శిక్షణ ఇప్పించాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది.

ABOUT THE AUTHOR

...view details