తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు వేళాయే! నోటిఫికేషన్ రిలీజ్ ఎప్పుడంటే?

మహారాష్ట్ర ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు - వచ్చే వారంలో భారత ఎన్నికల సంఘం ప్రకటన!

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

Maharashtra Jharkhand Election
Maharashtra Jharkhand Election (ANI)

Maharashtra Jharkhand Elections :మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం వచ్చేవారం ప్రకటించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నవంబర్‌ రెండు లేదా మూడో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లోని 45 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు సైతం జరపనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గం కూడా ఉంది.

ఇటీవల హరియాణా, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో భారత ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించింది. ఇప్పుడు మహారాష్ర్ట, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ సన్నద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ మరికొన్ని రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ రెండు లేదా మూడో వారంలో పోలింగ్‌ను నిర్వహించేందుకు ఈసీ సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌ 29 నుంచి నవంబర్‌ 3 మధ్యలో దీపావళి, ఛత్‌ వంటి పండుగలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలను నవంబర్‌ రెండు లేదా మూడో వారంలో నిర్వహించాలని ఈసీ యోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ పండుగల వేళ మహారాష్ట్రలో నివసిస్తున్న బిహారీ ఓటర్లు స్వస్థలాలకు వెళ్లే అవకాశం ఉందని అందుకే ఎన్నికలను నవంబర్‌ మెుదటి వారం తర్వాతే నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.

45 స్థానాల్లో ఉప ఎన్నిక
మరోవైపు ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను ఈసీ నిర్వహించనుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. వివిధ రాష్ట్రాల్లోని 45 అసెంబ్లీ నియోజకవర్గాలకు, రెండు పార్లమెంట్‌ నియోజవర్గాలకు ఉప ఎన్నికలు జరపనున్నట్లు వెల్లడించాయి. ఇందులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గం కూడా ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో గెలిచిన రాహుల్ వయనాడ్‌ స్థానాన్ని వదులుకోవడం వల్ల ఆ స్థానం ఖాళీ అయింది. బంగాల్​లోని బసిర్‌హట్‌ నియోజకవర్గ ఎంపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత షేక్‌ నూరల్‌ ఇస్లాం మృతి చెందడం వల్ల ఆస్థానంలో కూడా ఉపఎన్నిక జరగాల్సి ఉంది.

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details