తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్కడ మాజీ సీఎం- ఇక్కడ కేంద్రమంత్రి- లోక్​సభ ఎన్నికలకు జోరుగా నామినేషన్లు - Lok Sabha Polls 2024 - LOK SABHA POLLS 2024

Lok Sabha Polls 2024 Nominations Today : కర్ణాటకలో మాజీ సీఎం కుమారస్వామి, బీజేపీ నేత తేజస్వీ సూర్య, కేరళలో కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, బీజేపీ అధ్యక్షుడు కే.సురేంద్రన్‌తోపాటు యూపీలో సినీనటి హేమమాలిని గురువారం నామినేషన్లు వేశారు. సార్వత్రిక ఎన్నికల రెండో విడతకు నామినేషన్ల గడువు గురువారం ముగియనుండగా, నామినేషన్ల పరిశీలనను శుక్రవారం చేపట్టనున్నారు.

Lok Sabha Polls 2024 Nominations Today
Lok Sabha Polls 2024 Nominations Today

By ETV Bharat Telugu Team

Published : Apr 4, 2024, 2:12 PM IST

Lok Sabha Polls 2024 Nominations Today: లోక్‌సభ ఎన్నికల రెండో విడత బరిలో ఉన్న పలువురు ప్రముఖులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. కర్ణాటకలోని మండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మాజీ సీఎం, జేడీఎస్‌ నేత హెచ్​డీ కుమారస్వామి గురువారం నామినేషన్ వేశారు. మాజీ సీఎం, బీజేపీ నేత యడియూరప్ప, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌, మైసూర్‌ రాజవంశానికి చెందిన యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్‌ వెంటరాగా కుమారస్వామి నామినేషన్‌ వేశారు.

నటి సుమలత మద్దతుతో!
గత ఏడాది సెప్టెంబర్‌లో కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్‌ మధ్య పొత్తు కుదిరింది. కర్ణాటకలో ఉన్న 28 లోక్‌సభ స్థానాల్లో 3 సీట్లను పొత్తులో భాగంగా జేడీఎస్‌కు బీజేపీ కేటాయించింది. మండ్య నియోజకవర్గంలో గతంలో సినీ నటి సుమలత బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అయితే ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన సుమలత, మండ్యలో కుమారస్వామికి మద్దతు ఇచ్చారు.

కేంద్రమంత్రి నామినేషన్​కు వేళాయే!
కేరళలో ఎన్డీఏ అభ్యర్థి, కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్‌కు నామ పత్రాలు సమర్పించారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌ సహా ఇతర బీజేపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్‌ దాఖలుకు ముందు తిరువనంతపురంలో భారీ రోడ్‌షోను రాజీవ్‌ చంద్రశేఖర్‌ నిర్వహించారు. తిరువనంతపురం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిట్టింగ్‌ ఎంపీ శశిథరూర్‌, సీపీఐ వెటరన్‌ పన్నియన్ రవీంద్రన్‌తో రాజీవ్‌ చంద్రశేఖర్‌ తలపడుతున్నారు. శశిథరూర్‌ ఇప్పటికే తిరువనంతపురంలో నామినేషన్‌ వేశారు.

కాంగ్రెస్​ నేత వేణుగోపాల్ కూడా!
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కేరళలోని అలప్పుజ నియోజకవర్గంలో గురువారం నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ నేతలు వెంటరాగా ఆయన నామపత్రాలు సమర్పించారు.

నిన్న రాహుల్​- నేడు సురేంద్రన్​
కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ వయనాడ్‌లో నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై సురేంద్రన్‌ పోటీ చేస్తున్నారు. అమేఠీలో రాహుల్‌ గాంధీని ఓడించిన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీతో కలిసి వయనాడ్‌లో సురేంద్రన్‌ రోడ్‌ షో నిర్వహించారు.

గెలిచేలా చూడు గణేశా!
కర్ణాటకలోని బెంగళూర్‌ దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి తేజస్వీ సూర్య నామపత్రాలు దాఖలు చేశారు. అంతకంటే ముందు గిరి నగర్‌లోని గణేశ్ ఆలయంలో తేజస్వీ సూర్య పూజలు నిర్వహించారు. ఉత్తర్​ప్రదేశ్​ మథురలో బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని నామినేషన్ దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details