Cylinder Blast In Uttar Pradesh : ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి రెండు సిలిండర్లు పేలిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు అగ్ని మాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఉత్తర్ప్రదేశ్లో లఖ్నవూ జిల్లాలో జరిగిందీ దుర్ఘటన.
ఇదీ జరిగింది
కకోరి పోలీస్ స్టేషన్ పరిధిలో ముషీర్ అలియాస్ పుట్టు అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ముషీర్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా బంధువులంతా కలిశారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి 10.30 సమయంలో అతని ఇంట్లోని రెండో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఆ సమీపంలో ఉన్న రెండు సిలిండర్లు పేలిపోయాయి. ఇంటి పైకప్పు కాలిపోవడం వల్ల ఇంట్లో ఉన్న ముషీర్, హుస్న్ బానో, ఉమ, హీనా, రాయలు సజీవదహనమయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ముషీర్ కుమార్తె ఇషా(17), బంధువులు లకబ్(21), అజ్మద్, ముషీర్ సోదరుడు బబ్లూ కుమార్తె అనమ్(18)లు మంటల్లో తీవ్రంగా గాయాలపాలయ్యారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ సిలిండర్లు పేలుడు ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.