బస్సు ఆపలేదని రాళ్లు విసిరిన మహిళ.. అద్దాలు ధ్వంసం.. రూ.5వేల ఫైన్తో షాకిచ్చిన ఆర్టీసీ! - మహిళ దాడిలో బస్సు అద్దాలు ధ్వంసం
🎬 Watch Now: Feature Video
బస్సు ఆపలేదనే ఆగ్రహంతో రాళ్లు విసిరింది ఓ మహిళ. దీంతో ఆ బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రభుత్వ వాహనంపై దాడి చేసినందుకుగాను ఆ మహిళకు రూ.5వేల జరిమానాను విధించారు అధికారులు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో జరిగిందీ ఘటన.
ఇదీ జరిగింది..
లక్ష్మి.. పాపనపల్లి ప్రాంతానికి చెందిన మహిళ. హోసలింగపురకు హులిగెమ్మ దేవి దర్శనం కోసం వచ్చింది. దర్శనం ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చి.. బస్ కోసం వేచి చూస్తోంది. అదే సమయంలో అటుగా వచ్చిన నాన్స్టాప్ బస్ను ఆపమని విజ్ఞప్తి చేసింది. కానీ డ్రైవర్ దానిని ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన లక్ష్మి.. దానిపై రాళ్లతో దాడి చేసింది. దాడికి గురైన బస్సు కొప్పల్ నుంచి హోస్పేట వెళుతోంది.
వెంటనే బస్సును ఆపిన కండక్టర్.. డిపో మేనేజర్కు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి వచ్చిన డిపో మేనేజర్ మహిళకు రూ.5వేలు చెల్లించాల్సిందిగా సూచించాడు. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో అధికారులకు క్షమాపణ చెప్పిన మహిళ.. అనంతరం ఆ జరిమానా మొత్తాన్ని చెల్లించింది. తిరిగి అదే బస్సులో తన గమ్యస్థానానికి వెళ్లింది.