Published : Nov 15, 2023, 1:34 PM IST
ఎన్నికల్లో హామీలు నేరవేరుస్తామని బాండ్ రాసిస్తేనే ఓటు వేస్తాం : ఆదివాసీలు
Tribal People Demands in Telangana Elections : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని 18 గ్రామాల వలస ఆదివాసీలు హామీలు నెరవేరుస్తామని బాండ్ రాసి ఇస్తేనే ఓట్లు వేస్తామని తేల్చి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో సుమారు 90 వలస ఆదివాసీల గ్రామాలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో కలిసి సుమారు లక్ష మంది వలస ఆదివాసీ ఓటర్లు ఉన్నారు. వీరంతా సుమారు 70 ఏళ్ల నుంచి తెలంగాణలో అటవీ ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో తమ ఓట్లను వాడుకుంటున్నాయని.. కానీ తమ ప్రాంతాలకు కనీస వసతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Adivasis Demands in Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని 18 గ్రామాల్లో వలస ఆదివాసీలు హామీలను నెరవేర్చాలని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మూడు హామీలు ఇస్తానంటేనే ఓట్లు వేస్తామని... లేకుంటే ఓట్లు వేయమని తేల్చి చెబుతున్నారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కీకారణ్య గ్రామాల గోండి (గొత్తి కోయ) ఆదివాసీలు తమ డిమాండ్ల సాధనకు గళమెత్తారు. తమతో ఓటు వేయించుకుంటున్న పాలకులు తమను ఇప్పటికీ పరాయివాళ్లుగా చూస్తున్నారని అక్షేపించారు. బూరుగుపాడులో జరిగిన 18 గ్రామాల గోండి యువసేన సమావేశంలో పలు తీర్మానలు చేయాలని నిర్ణయించారు. తమ గ్రామాలను రెవెన్యూ గ్రామాలు చేయాలనీ.. గోండి కుల ధ్రువీకరణ పత్రాలను పునరుద్దరించాలని.. పోడు భూములుకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈసారి ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామని గుత్తి కోయలు అంటున్నారు.