Sircilla Handloom worker Weaved Images of G20 Leaders on Cloth : వస్త్రంపై జీ20 దేశాధినేతల చిత్రాలు.. సిరిసిల్ల చేనేత కార్మికుడి అరుదైన కళాఖండం - G20 Summit in Delhi
🎬 Watch Now: Feature Video
Published : Sep 9, 2023, 7:31 PM IST
Sircilla Handloom worker Weaved Images of G20 Leaders on Cloth : దిల్లీలో జీ20 సమావేశాలు (G20 Summit in Delhi) జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 20 దేశాల దేశాధినేతల చిత్రాలతో సహా.. వారికి ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలుకుతున్నట్లు ఉన్న ఫోటోలను వస్త్రంపై నేసి.. తన నేత కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు ఓ నేత కార్మికుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్కు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ మరమగ్గాలపై రకరకాల కళాఖండాలు నేస్తూ.. గతంలో అందరినీ అబ్బురపరిచాడు. అగ్గిపెట్టెలో పట్టే చీర, దబ్బనంలో దూరే చీర, నేతన్న సిరిపట్టు, ఇలా ఎన్నో వస్త్రాలపై కళారూపాలను రూపొందించి తన ప్రతిభతో ఔరా అనిపించుకున్నాడు.
ఇప్పుడు తాజాగా జీ20 సదస్సు జరుగుతున్న సందర్భంగా.. 20 దేశాల దేశాధినేతల చిత్రాలను (Weaved Images of G20 Leaders on Cloth) మరమగ్గంపై రూపొందించాడు. 20 దేశాధినేతల చిత్రాలతో పాటు.. వారికి ప్రధాని నరేంద్ర మోదీ నమస్తే అని స్వాగతం పలుకుతున్న చిత్రాలను.. ఇరువైపులా జీ 20 లోగో వచ్చే విధంగా తయారు చేశాడు. వారం రోజులు శ్రమించి దీన్ని రూపొందించినట్లు హరిప్రసాద్ తెలిపారు. తనకు అవకాశం కల్పిస్తే మోదీకి అందజేస్తానని పేర్కొన్నారు. గతంలోనూ జీ20 లోగో నేసి ప్రధానికి పంపించినట్లు.. దాని గురించి మన్కీ బాత్లో కూడా మోదీ ప్రస్తావించినట్లు హరిప్రసాద్ వివరించారు.